రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు

- November 08, 2021 , by Maagulf
రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు

అమరావతి: ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడుకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల ముందు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నిరసనలు చేపట్టాలన్నారు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయన్నారు చంద్రబాబు. అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. హామీ ప్రకారం పెట్రోల్ పై 16 రూపాయలు, డీజిల్ పై 17 రూపాయలు తగ్గించాలన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఉన్నాయన్నారు చంద్రబాబు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావన్నారు. అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతింటోందన్నారు. పెట్రోల్ ధరలతో ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు దెబ్బతింటున్నారన్నారు. రవాణ ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటుగా మారిందన్నారు. పాదయాత్రలో జగన్ రెడ్డి మాట్లాడిన దానికి చేస్తున్న దానికి ఏమైనా పొంతన ఉందా అని ప్రశ్నించారు చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com