చర్మ వ్యాధులకు వేపాకుతో చెక్..
- January 22, 2022ఆయుర్వేద శాస్త్రంలో వేపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరైతే పగలు వేపచెట్టు నీడలో ఉంటారో వారు ఆరోగ్యవంతులుగా ఎక్కువ కాలం జీవిస్తారని ఆనాడే చెరకుడు తన ఆయుర్వేద గ్రంధంలో వివరించాడు. అంతటి ప్రసిద్ధికలిగినది వేప చెట్టు. వేప చెట్లు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వేపచెట్టు ఆకులుతో అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. గృహ వైద్యంలో వేపాకులను పూర్వ కాలం నుండి వినియోగిస్తున్నారు. వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు.
అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వేపాకుల్లో ఫ్యాటీ యాసిడ్లు, లిమోనోయిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి అనేక చర్మ సమస్యలను నయం చేస్తాయి. అందువల్ల గోరు వెచ్చని నీటితో స్నానం చేయడంతోపాటు ఆ నీటిలో వేపాకులను వేయాలి. ఇలా చేయటం వల్ల అనేక చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.
వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగుసేవిస్తుంటే కడుపు, పేగు ల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. మీజిల్స్, చికెన్పాక్స్లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి. వేపాకులను వేసి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిదనం తగ్గుతుంది. చలికాలంలో చర్మం మరీ పొడిగా అయ్యేవారు ఈ విధంగా స్నానం చేయడం వల్ల ఆ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. ఈవిధంగా స్నానం చేస్తే చర్మంపై ఉండే సహజసిద్ధమైన నూనెలు అలాగే ఉంటాయి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.
వేపాకు, నెయ్యి సమానంగా తీసుకుని నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేట్లు కాచి మొత్తమంతా కాలిపి నూరి నిలువ ఉంచుకోవాలి. రోజూ రెండు సార్లు దీనిని లేపనం చేస్తుంటే వ్రణాలు, దీర్ఘకాలిక పుళ్లు, దుష్ట వ్రణాలు తగ్గుతాయి. వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జుట్టుకు అయితే చుండ్రు తగ్గుతుంది. జుట్టు సమస్యలు కూడా పోతాయి. శిరోజాలు, తలపై భాగం ఆరోగ్యంగా ఉంటాయి. వేపాకులను వాడలేమని అనుకునేవారు మార్కెట్లో వేప నూనె లభిస్తుంది. దాన్ని కూడా నీటిలో వేసి ఉపయోగించవచ్చు.
వారానికి ఒకసారి వేపాకులను పేస్ట్లా చేసి శరీరానికి రాసి గంట సేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే అన్ని రకాల చర్మ సమస్యలు పోయి చర్మం మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది. చర్మంపై ఉండే ముడతలు కూడా పోయి యవ్వనంగా కనిపిస్తారు. వేప ఆకులు లేదా వేప నూనెను వేసిన నీటితో స్నానం చేయడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. వేప నూనెతో శరీరాన్ని వారానికి ఒకసారి మసాజ్ కూడా చేసుకోవచ్చు. చెవిపై, చెవు చుట్టూ అయ్యే కురుపులు చాలా నొప్పి పెడుతుంటాయి. సున్నితమైన భాగం కావడంతో ఆ నొప్పి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అయితే, అటువంటి చెవి నొప్పి నివారణకు కూడా వేపాకు మిశ్రమం బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కొన్ని వేప ఆకులను ద్రవ రూపంలో ఒక మిశ్రమంలా చేసి అందులో కొంత తేనె కలపండి. చెవిని ఇబ్బంది పెడుతున్న కురుపులపై ఆ మిశ్రమం నుంచి తీసిన కొన్ని చుక్కలను వేస్తే నొప్పి మాయం అవుతుందట.
కళ్లలో మంటగా , కళ్లు అలసటగా ఉండటం వంటి సమస్యలు ఎదురైనప్పుడు వేపాకులతో సహజ పద్ధతిలో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కొన్ని వేప ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని పూర్తిగా చల్లబరచండి. ఆ తర్వాత ఆ చల్లటి నీళ్లతో కళ్ళు శుభ్రంగా కడుక్కుంటే.. సాధారణ కంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా మనం చల్లనినీరు, వేడి నీళ్లు కలిపి ఒక మోస్తరు వేడి ఉండేలా చూసుకుని ఆ నీటితో స్నానం చేస్తాం. కనుక చల్లని నీటిలో ముందు రోజు రాత్రే వేపాకులను వేసి ఉంచాలి. మరుసటి రోజు ఆ నీటిలో వేడి నీటిని కలిపి దాంతో గోరు వెచ్చగా నీరు ఉండేలా చూసుకుని స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల సమస్యల నుంచి బయట పడవచ్చు.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన