ఖతార్-భారత్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు: భారత విదేశాంగ శాఖ

- May 09, 2022 , by Maagulf
ఖతార్-భారత్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు: భారత విదేశాంగ శాఖ

ఖతార్: భారతదేశం, ఖతార్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయని, అవి అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వి మురళీధరన్ తెలిపారు. ఆదివారం దోహాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత రెండేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందని, అయితే దీన్ని మరిన్ని రంగాలకు విస్తరించాల్సి ఉందన్నారు. రెండు దేశాల మధ్య విస్తృతమైన అనుబంధం ఉందని, వివిధ రంగాల్లో తమ ప్రాతినిధ్యాన్ని చాటుకుంటూ భారతీయ ప్రవాసులు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని మంత్రి ఆకాంక్షించారు. అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారం పెరుగుతోందని, అయితే మరింత అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఖతార్ ఆహార భద్రతా కార్యక్రమాలలో భారతదేశం, భారతదేశ ఇంధన భద్రతలో ఖతార్ పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందుకు భారతీయ ప్రవాసులకు అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఖతార్ లోని భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రెటరీ విపుల్ లతోపాటు పలువురు భారత, ఖతార్ అధికారులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com