కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబంపై సీబీఐకు కేఏ పాల్ ఫిర్యాదు

- June 22, 2022 , by Maagulf
కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబంపై సీబీఐకు కేఏ పాల్ ఫిర్యాదు

హైదరాబాద్: కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (CBI) కార్యాల‌యానికి ప్రజాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఫిర్యాదు చేశారు. సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ఫిర్యాదు లేఖ ఇచ్చారు. రాష్ట్రంలో రూ.9 లక్షల కోట్ల అవినీతికి కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిందని ఆయ‌న ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని అవినీతి తెలంగాణలో జరిగిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని ఆయ‌న తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంద‌ని, ఇప్పుడు కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల రూపాయ‌ల‌ అప్పు చేసిందని ఆయ‌న అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ రావు, సంతోష్ కుమార్, కవిత పెద్ధ‌ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్ల రూపాయ‌లు కాగా రూ.35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. 75 వేల కోట్ల రూపాయ‌లు దోచుకున్నారని అన్నారు.

యాదాద్రి పున‌ర్నిర్మాణ ప‌నుల్లోనూ అవినీతి జరిగిందని ఆయ‌న ఆరోపించారు. రూ.2 వేల కోట్ల అంచనాలో రూ.200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారని అన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలని అన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు త‌నపై దాడులు చేస్తున్నారని ఆయ‌న చెప్పారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తున‌కు త‌న‌ పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. సీబీఐతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాల‌కు ఫిర్యాదు కాపీలను కేఏ పాల్ పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com