బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్!

- January 24, 2023 , by Maagulf
బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్!

యూఏఈ: నానాటికి పెరుగుతున్న బంగారం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు భారత ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బంగారం దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వినియోగదారు దేశంగా ఉన్న భారత్.. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వలన గిరాకీ పెరుగుతుందని భావిస్తోంది. దీంతో బంగారం ధరలు తగ్గి రిటైల్ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
భారత కస్టమ్స్, ఇతర ఏజెన్సీలు గత ఏడాది నవంబర్ వరకు అక్రమంగా తీసుకువచ్చిన 3,083.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇది మూడేళ్లలో అత్యధికం కావడం గమనార్హం. భారతీయ బంగారం ధరలు గత వారం రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 56,850 రూపాయలకు చేరుకున్నాయి. స్మగ్లింగ్ పెరుగుదల కారణంగా గతేడాది డిసెంబరులో చట్టపరమైన మార్గాల్లో బంగారం దిగుమతుల్లో 79% తగ్గుదల చోటుచేసుకుంది.  
వాణిజ్య లోటును తగ్గించడానికి, రూపాయికి మద్దతు ఇవ్వడానికి భారత ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 7.5% నుండి 12.5%కి పెంచింది. దీంతో విదేశాల నుండి బంగారాన్ని అక్రమంగా తరలించడం పెరిగింది. ప్రస్తుతం బంగారంపై దిగుమతి సుంకం 18.45%గా ఉంది. ఇందులో 12.5% దిగుమతి సుంకం కాగా, 2.5% వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్, ఇతర పన్నులు ఉన్నాయి. త్వరలోనే దిగుమతి సుంకాన్ని 12% దిగువకు తీసుకురావడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపినట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. అయితే, దీనిపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించాల్సి ఉంది. రాబోయే బడ్జెట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భారత బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com