పాకిస్తాన్‌ పై భారత్ ఘనవిజయం

- February 13, 2023 , by Maagulf
పాకిస్తాన్‌ పై భారత్ ఘనవిజయం

కేప్ టౌన్: సౌతాఫ్రికా గడ్డ పై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. తాము ఆడ పిల్లలం కాదు ఆడ పులులం అని నిరూపించారు.చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కు చుక్కలు చూపించారు. దాయాది దేశాన్ని చిత్తు చిత్తుగా ఓడించారు. పాక్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో 7 వికెట్లు, 6 బంతులు మిగిలి ఉండగానే భారత మహిళల జట్టు చేజ్ చేసింది.

ఓపెనర్లు యస్తికా భాటియా (20 బంతుల్లో 17 పరుగులు), షెఫాలీ వర్మ (25 బంతుల్లో 33 పరుగులు) భారత్ కు మంచి శుభారంభం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన జమియా రోడ్రిగ్స్ అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచరీతో (53*) అదరగొట్టింది. మరో బ్యాట్స్ ఉమెన్ రిచా ఘోష్ కూడా రాణించింది. వరుసగా 3 ఫోర్లు కొట్టి పాక్ పై ఒత్తిడి పెంచింది. రోడ్రిగ్స్ కూడా ఫోర్లు బాది భారత్ ను విజయతీరాలకు చేర్చింది. వీరిద్దరి జోడీ భారత్ విజయంలో కీ రోల్ ప్లే చేసింది.

పాక్ జట్టు కెప్టెన్ బిస్మా మారూఫ్ హాఫ్ సెంచరీతో రాణించింది. 55 బంతుల్లో 68 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె స్కోరులో 7 ఫోర్లు ఉన్నాయి. చివర్లో ఆయేషా నసీమ్ ధాటిగా ఆడడంతో పాక్ కు ఆ మాత్రమైనా స్కోర్ వచ్చింది. ఆయేషా 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేసింది.

టీమిండియా బౌలర్లలో రాధా యాదవ్ 2 తీసింది. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు. గ్రూప్ 2లో ఇది నాలుగో మ్యాచ్. కేప్ టౌన్ వేదికగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com