ఎయిర్ బస్‌తో ఎయిర్ ఇండియా భారీ డీల్..

- February 14, 2023 , by Maagulf
ఎయిర్ బస్‌తో ఎయిర్ ఇండియా భారీ డీల్..

ముంబై: ఎయిర్ బస్‌తో ఎయిర్ ఇండియా మధ్య ప్రపంచ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద డీల్ కుదిరింది. విమానాలు తయారు చేసే ఎయిర్ బస్ సంస్థ నుంచి 250 విమానాలు కొనుగోలు చేసేందుకు దేశీయ సంస్థ ఎయిర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 250 విమానాల్లో 40 భారీ ఏ350 విమానాలు కూడా ఉండటం విశేషం.

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, ఎయిర్ బస్ సంస్థ అధినేత గ్విల్లామే ఫౌరీ, రతన్ టాటా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మార్కోన్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. వీరంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధరించారు. ఎయిర్ బస్‌తో ఎయిర్ ఇండియా కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువ 100 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఎయిర్ ఇండియా సంస్థ టాటా సన్స్ గ్రూప్‌నకు చెందినది అనే సంగతి తెలిసిందే. టాటా సంస్థ కొంతకాలం క్రితం 470 విమానాల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఎయిర్ బస్‌తో 250 విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకుంది.

మిగతా 120 విమానాల్ని ‘బోయింగ్’ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో భారత ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు మార్కోన్ మాట్లాడారు. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల విషయంలో మైలురాయి వంటిదని మార్కోస్ అభివర్ణించారు. వైమానిక రంగంలో ఇండియా.. ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవబోతుందని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే 15 ఏళ్లలో దేశానికి 2,500 విమానాలు అవసరమవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు.

ఏ350 విమానాలకు సంబంధించి రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏ350-900 కాగా, మరోటి ఇంకా పెద్దదైన ఏ350-1000. ఈ విమానాలు తక్కువ దూరం నుంచి 17,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగల సామర్ధ్యం కలిగి ఉంటాయి. వీటిలో త్రీ క్లాస్ విమానాలైతే 300-401 మంది వరకు ప్రయాణించవచ్చు. అదే సింగిల్ క్లాస్ విమానాలైతే 480 మంది వరకు ప్రయాణించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com