బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

- February 19, 2023 , by Maagulf
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. ఈ నెల 16న గుండె సంబంధిత సమస్యలతో యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూశారు. ఆయన స్వస్థలం హైదరాబాద్ లోని చిక్కడపల్లి. 1951, మార్చి 5న సాయన్న జన్మించారు.

ఓయూ నుంచి ఆయన బీఎస్సీ, తర్వాత ఎల్ఎల్బీ పూర్తి చేశారు. సాయన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదట సాయన్న టీడీపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన 1994-2009 మధ్య 3 సార్లు ఆ పార్టీ తరఫున కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అనంతరం 2009లో ఓడిపోయిన ఆయన 2014 మళ్లీ గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. ఆయన 6 సార్లు హుడా డైరెక్టర్‌ గానూ గతంలో పనిచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల ఆ పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

సాయన్న మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. సాయన్న అందరితో ఆత్మీయంగా మాట్లాడేవారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com