కేంద్ర క్రీడా శాఖ మంత్రితో 6గంటలు సమావేశమైన రెజ్లర్లు..

- June 07, 2023 , by Maagulf
కేంద్ర క్రీడా శాఖ మంత్రితో 6గంటలు సమావేశమైన రెజ్లర్లు..

న్యూ ఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫేడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన బుధవారంనాడు మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు రెజర్లు బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్ సుమారు ఆరు గంటల సేపు ఢిల్లీలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఇక ఇదే సమావేవంలో 5 డిమాండ్లతో కూడిన లిఖిత పూర్వక ప్రతిపాదనను మంత్రికి రెజ్లర్లు సమర్పించారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి అనురాగ్.. ఈనెల 15వ తేదీతో దర్యాప్తు పూర్తవుతుందని, అంతవరకూ వేచిచూడాలని కేంద్రం రెజ్లర్లను కోరారు.

మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. 1-బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయడం.. 2-భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించడం, 3-సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించకూడదు, 4-రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాలక మండలికి ఎన్నికలు నిర్వహించాలి, 5-జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతల కారణంగా తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలి. ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వానికి రెజ్లర్లు లిఖితపూర్వకంగా ఇచ్చారు.

కాగా, రెజ్లర్లతో సమావేశానంతరం మీడియాతో మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా రెజ్లర్లతో తాను చర్చలు జరిపినట్టు తెలిపారు. ఈనెల 15వ తేదీ కల్లా దర్యాప్తు పూర్తవుతుందని, చార్జిషీటు సమర్పిస్తారని తాను రెజ్లర్లకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు ఈనెల 30న జరుపుతామని మంత్రి అనురాగ్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com