ఢిల్లీ, ముంబయితోపాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

- July 01, 2023 , by Maagulf
ఢిల్లీ, ముంబయితోపాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఢిల్లీ, ముంబయి నగరాలతో సహా పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. న్యూ ఢిల్లీలో కురిసిన భారీవర్షాల వల్ల పలు రోడ్ల పై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

బారాపుల్లా ఫ్లైఓవర్, పంచకుయాన్ మార్గ్, మునిర్కా ఫ్లైఓవర్ కింద, తూర్పు వినోద్ నగర్, నజాఫ్‌గఢ్‌లోని ధన్సా రోడ్డు, మండోలి రోడ్డు, ఐపీ మార్గ్‌లో నీటి ఎద్దడి కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వరదల వల్ల సౌత్ ఎక్స్‌టెన్షన్, సరాయ్ కాలే ఖాన్, లజ్‌పత్ నగర్, ఐటీఓ, సెంట్రల్, ఔటర్ ఢిల్లీలోని భాగాలు, మెహ్రౌలీ-బాదర్‌పూర్ రహదారిపై, గీతా కాలనీ, అక్షరధామ్ దేవాలయం మధ్య ట్రాఫిక్ నిలిచిపోయింది.

ముంబయిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్ని ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహం కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.ఢిల్లీ, ముంబయి పశ్చిమ రైల్వేలోని అంధేరి మరియు జోగేశ్వరి రైల్వే స్టేషన్‌ల మధ్య రద్దీగా ఉండే సబ్‌వే చుట్టూ నీరు చేరడం వల్ల రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ముంబయిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబయి నగరానికి తాగునీటి కొరత తీరనుంది. ఏడు సరస్సుల నీటి మట్టం పెరగడంతో ముంబయి నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారు. జూన్ 28 నాటికి ఈ రిజర్వాయర్లలో మొత్తం నీటి నిల్వలు 7.26 శాతం ఉండగా, ప్రస్తుతం 10.88 శాతానికి చేరుకుందని అధికారులు తెలిపారు.

ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో జూలై 2వతేదీ వరకు విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ‘‘కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. పంజాబ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com