రెహ్మాన్ పాట..కోహ్లీ గానం..!

- June 06, 2016 , by Maagulf
రెహ్మాన్ పాట..కోహ్లీ గానం..!

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ అతడు. టీ20 క్రికెట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఈ ఏడాది ఆరంభం నుంచి తన కళాత్మక విధ్వంసంతో మైదానంలో సిక్సర్లు, బౌండరీల వరద పారిస్తున్న పరుగుల యంత్రంగా మారిన విరాట్‌కోహ్లీ. మరొకరేమో తన సమ్మోహన సంగీత పరిజ్ఞానంతో అభిమానులను పాటల ప్రపంచంలో ఓలలాడిస్తున్న స్వరకర్త. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు గెలిచిన తొలి భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌. తన బ్యాటింగ్‌ నైపుణ్యం, మైదానంలో దూకుడుతో యువతలో విపరీతమైన క్రేజ్‌ సొంతం చేసుకున్న విరాట్‌కోహ్లీ పాటల మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరపరిచే ఓ గీతానికి గాత్రం అందించనున్నాడు.
భారత్‌లో ఈ ఏడాది నుంచి 'ప్రీమియర్‌ ఫుట్‌సల్‌' పేరుతో ట్వంటీ20 సాకర్‌ లీగ్‌ను నిర్వహించనున్నారు. విరాట్‌కోహ్లీ దీనికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఫుట్‌సల్‌ లీగ్‌ అధికారిక గీతాన్ని ఏఆర్‌ రెహ్మాన్‌ స్వర పరుస్తున్నారు. లీగ్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ లభించాలనే ఉద్దేశంతో రెహ్మాన్‌ స్వరపరిచే 'నామ్‌ హై ఫుట్‌సల్‌' గీతానికి కోహ్లీ గాత్రం అందించేలా లీగ్‌ యాజమాన్యం ఒప్పందం కుదర్చుకొంది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ తాను రెహ్మాన్‌ వీరాభిమానినని, ఆయన స్వరపరిచే గీతానికి గాత్రం అందించడం చాలా గొప్పగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. కోహ్లీతో కలిసి పనిచేసేందుకు తాను ఉవ్విళ్లూరుతున్నానని, అది తనకెంతో ఉత్సాహం కలిగిస్తోందని రెహ్మాన్‌ చెప్పారు. జూన్‌ 20న విడుదల చేసే ఈ గీతంలో అభిమానులు కోహ్లీ అభినయంతో పాటు గాత్రాన్నీ ఆనందించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com