మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా...!

- July 27, 2024 , by Maagulf
మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా...!

ఆదర్శానికి నిలువెత్తు రూపం.. యువతలో విజయకాంక్షలను రగిలించిన మిస్సైల్ మ్యాన్, భారత దేశ దివంగత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ మరణించి నేటితో 9 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఎందరో యువతకు స్ఫూర్తిని నింపి కలలంటే నీకు నిద్రలో వచ్చేవి కావు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవి అని స్ఫూర్తి ని నింపిన అబ్దుల్ కలాం. నేడు అబ్దుల్ కలామ్ వర్థంతి సందర్భంగా ఆ మహాత్మునికి యావత్ భారత దేశం ఘన నివాళులర్పిస్తుంది.

ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ పూర్తిపేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలామ్. 1931వ సంవత్సరం అక్టోబర్‌ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులాబ్దిన్‌, ఆసియామ్మ దంపతులకు జన్మించారు. కలామ్ కుటుంబం పేదరికంలో ఉండడంతో చిన్న తనం నుండే తన అవసరాలకు పేపర్ బాయ్ గా పని చేశారు.

1960 సంవత్సరంలో” ది మద్రాస్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ” నుంచి కలామ్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరి ఆ తరువాత ఇస్రోలో కూడా ఆయన తన సేవలు అందించారు. 1963 సంవత్సరం తర్వాత పలు దేశాల్లో పర్యటించారు. బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్‌ డెవిల్‌, ప్రాజెక్ట్‌ వాలియంట్‌లలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే భారత అణు పరీక్ష కేంద్రంలో కీలకంగా పనిచేసారు. అరవైవ దశకంలో చైనా, పాకిస్థాన్ లతో భారత్ యుద్ధం చేయాల్సి వస్తూ ఉండేది ఆ సమయంలో భారత రక్షణ రంగం మరింత పటిష్టంగా ఉండాలని కలామ్ గుర్తించారు.  

ఇందుకోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. ఆ సమయంలో కలామ్ ఇస్రోలో సేవలు అందిస్తూ ఉండేవారు. ఆ సమయంలో పిఎస్‌ఎల్‌వి, ఎస్‌ఎల్‌వి-3 వంటి ప్రాజెక్టులను రూపొందించడంలో కలామ్ ఎంతగానో కృషి చేసారు. 1970 దశకంలో బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేయాలనే సంకల్పాన్ని కలామ్ వెల్లడించారు. ప్రాజెక్ట్‌ డెవిల్‌, ప్రాజెక్ట్‌ వాలియంట్‌లకు రూపకల్పన చేసి ఆ ప్రోజెక్టుల విషయంలో కలామ్ విశేషమైన సేవలందించారు. 1997వ సంవత్సరంలో ఆయనను భారతరత్న వరించింది.

ఇక భారత దేశానికి 2002 నుండి 2007 సంవత్సరం వరకు 11వ రాష్ట్రపతిగా కలామ్ విశేష సేవలు అందించారు..భారత్ రక్షణ రంగం బ్రహ్మౌస్‌ వంటి సూపర్‌ సానిక్‌ మిస్సైల్‌ను తయారు చేయగలిగిందంటే దానికి కారణం ఆయన వేసిన గట్టి పునాదులే కారణం. దాదాపు 40 కి పైగా విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ను ప్రదానం చేసాయి. ప్రముఖ రచయిత అరుణ్‌ తివారి సాయంతో ఆయన తన ఆత్మకథ పుస్తకాన్ని ”వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌” పేరుతో విడుదల చేసారు. అలాంటి గొప్ప శాస్త్రజ్ఞుడు 83 ఏళ్ళ వయసులో 2015వ సంవత్సరం జులై 27వ తేదీన షిల్లాంగ్‌ లోని ఐఐఎంలో ప్రసంగిస్తుండగా తీవ్రమైన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

కలలను సాకారం చేసుకోమంటూ విద్యార్ధి లోకాన్ని తట్టిలేపిన మహనీయులు అబ్దుల్ కలామ్. ఆచరణ ద్వారా కలలను సాకారం చేసుకుని చూపించిన ఆదర్శమూర్తి. శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, అధ్యాపకుడిగా రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్ అందించిన సేవలు సామాన్యమైనవి కావు. “‘చిన్న లక్ష్యం కలిగి ఉండటమనేదే పెద్ద నేరంతో సమానమని” అబ్దుల్ కలామ్ ఎపుడూ చెబుతుండేవారు. మనం పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటికోసం పోరాడాలని చెబుతుండేవారు. మానవతా వాదిగా, శాస్త్రవేత్తగా అబ్దుల్  కలామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com