టాలీవుడ్ హాసిని...!

- August 05, 2024 , by Maagulf
టాలీవుడ్ హాసిని...!

తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ అప్పట్లో సౌత్ ఇండియన్ లీడింగ్ యాక్ట్రెస్ గా వెలుగొందింది. తన నటన, అందం, అభినయంతోపాటుగా అంతేనా..  వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ అంటూ తెలుగు యువ ప్రేక్షకుల హృదయాలు దోచేసిన మహారాష్ట్ర ముద్దుగుమ్మ జెనీలియా డిసౌజా. నేడు జెనీలియా పుట్టిన రోజు సందర్భంగా ఆమె సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం..

జెనీలియా డిసౌజా 1987, ఆగస్టు 5న ముంబై నగరంలో మంగళూరు కేథలిక్ కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు కార్పొరేట్ ఉద్యోగులు. మేనేజ్మెంట్ లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుకుంటూనే మోడలింగ్ చేస్తూ పలు ప్రకటనల్లో నటిచింది. 2003 లో  'నువ్వే కావాలి' సినిమాకు రీమేక్‌ అయిన  బాలీవుడ్‌ చిత్రం 'తుజే మేరీ కసమ్‌' అనే  హిందీ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో జెనిలీయ తన భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అదే సంవత్సరంలో బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జెనీలియాకు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

జెనీలియా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం సుమంత్‌ 'సత్యం' మూవీతోనే. ఆ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 2006లో బొమ్మరిల్లు సినిమాలో  ”హ.. హా హాసిని.. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే నాలుగు మాటలు” అంటూ కుర్రకారు హృదయాలను దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అలా తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేసింది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రెడీ, డీ, హ్యాపీ, మిస్టర్ మేధావి వంటి కమర్షియల్ హిట్స్ లో నటించింది.

తెలుగుతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ ల్లోనూ సత్తా చాటింది ఈ సొట్ట బుగ్గల సుందరి. హిందీలో కల్ట్ క్లాసిక్ ‘జానే తు…యా జానే నా’ లో అదితి పాత్రలో మెప్పించిన జెనీలియా నేషనల్ క్రష్ గా మారిపోయింది. హిందీలోనూ వరుస ఆఫర్లతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర్నుంచి నితిన్, రామ్, రామ్ చరణ్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2012 లో నటుడు రితేష్ దేశముఖ్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కుటుంబం పై దృష్టి పెట్టేందుకు ఇండస్ట్రీకి వీడ్కోలు పలికింది ఈ అందాల భామ.  చాలా కాలం గ్యాప్ తర్వాత 2022లో తన భర్త రితేష్ దేశముఖ్ తో కలిసి ‘వేద్’ సినిమాతో మళ్ళీ తెర పై మెరిసింది. జెనీలియా, ఆమె భర్త రితీష్ బి-టౌన్‌ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు పొందారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే ఈ జంట తమ సంతోషకరమైన క్షణాలు, ఫన్నీ రీల్స్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com