తెలుగు భాషా సాహితీ శిఖరం...!
- September 06, 2024
కొందరి జీవిత చరిత్రలు తర్వాతి తరానికి కనువిప్పు కలిగిస్తాయి. అటువంటి వారిలో తెలుగు సాహితీ, సంస్కృతుల గత వైభవాన్ని ఆధునిక సమాజానికి చాటి చెప్పిన మహనీయుడు ఆచార్య తూమాటి దోణప్ప ముఖ్యులు. వ్యావహారిక తెలుగు భాషాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. గ్రామీణ జీవన విధానంపై , జానపదులపై ఆయన విస్తృతమైన పరిశోధనలు జరిపారు. ఆచార్యుడిగా విద్యార్థుల ఉజ్వలమైన భవిష్యత్తుకు తోడ్పడ్డారు. నేడు గురుశిరోమణి, ఆచార్య తూమాటి దోణప్ప వర్థంతి.
ఆచార్య తూమాటి దోణప్ప గారి అసలు పేరు తూమాటి దోణతిమ్మారాయ చౌదరి. 1926, జూలై 1వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకా రాకెట్ల గ్రామంలోని సంపన్న రైతు కుటుంబానికి చెందిన తూమాటి సంజీవప్ప, తిమ్మక్కలకు ఎనిమిదవ సంతానంగా దోణప్ప జన్మించారు. తమ బంధువైన తూమాటి భీమప్ప గారు సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడు కావడంతో అయన వద్ద అమరం, శబ్దాలు, మేఘ దేశం, రకు రంగం, మున్నగు కావ్యాలను దొణప్ప పదేండ్ల పాటు చదివారు. ఆ విద్య కూడా ఆయన వెంటే వుంటూ ఆయన చెప్పిన పొలం పనులు చేస్తూ. “పనికి పని, పాఠానికి పాఠం” అన్నట్లుగా ఆడుతూ, పాడుతూ నేర్చుకొన్నారు.
భీమప్ప గారి వద్దే దోణప్ప హరికథ నేర్చుకున్నారు. ఆయన భారత, భాగవత రామాయణాలు చెబుతుంటే దోణప్ప గారు వాచకుడిగా వాటిని శ్రద్ధగా వినడం, ఒకొక్కసారి తాను కూడా ప్రవచనం చేయడం, అర్థం చెప్పడం అలవాటు చేసుకొన్నారు దొణప్ప ఇలా చిన్నతనంలోనే పురాణాలపై అతనికి మక్కువ జనించింది. ఈ విద్యలో పడిన దొణప్పకు’ పదేండ్ల వరకు ఎ. బి ,సి. డి లు కూడా రాలేదు తరువాత ఆయన వజ్రకరూరులోని మేనత్త భర్త చిన్న బొబ్బూరితిమ్మప్ప, వజ్రకరూరులోని హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించారు. వారి ఇంటివద్దనే ఉంటూ ఐదు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివారు. ఉరవకొండలోని జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో చేరి తెలుగు పండితుడైన నూతలపాటి పేరరాజు వద్ద ఆశుకవిత్వం చెప్పడం నేర్చుకున్నారు.
దోణప్ప1946లో ఎస్.ఎల్.సిలో ఉత్తీర్ణత సాధించి, అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరారు. అక్కడ శంఖవరం రాఘవాచార్యులు( సంపత్), కారెంపూడి రాజమన్నారు, మిక్కిలినేని వేంకటేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు వంటి హేమాహేమీల బోధనలో తెలుగు భాష మీద మరింత ఇష్టం ఏర్పడింది. 1949-52 మధ్య తెలుగు ప్రధానంగా విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో బి.ఎ. ఆనర్స్ పూర్తిచేశారు. అక్కడ గంటి జోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, కాకర్ల వెంకటరామ నరసింహం, భద్రిరాజు కృష్ణమూర్తి, ఓరుగంటి రామచంద్రయ్య, మధుసూదన షడంగి, వజ్ఝల చినసీతారామస్వామి వంటి ఉద్దండ పండితులు వీరికి అధ్యాపకులుగా వ్యవహరించారు. "ద్రవిడియన్ ఫిలాలజీ అండ్ జనరల్ లింగ్విస్టిక్స్"ను ప్రధానాంశంగా తీసుకోని 1953లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ.ఆనర్సులో ప్రథమశ్రేణిలోఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని సాధించారు.
దోణప్ప గారి ప్రతిభకు మెచ్చి అనకాపల్లి, గుడివాడ కళాశాలల్లో అధ్యాపకుడిగా ఉద్యోగాలు లభించినప్పటికి, ఈ రెండు అవకాశాలను కాదని గంటి జోగి సోమయాజి గారి వద్ద పరిశోధక విద్యార్థిగా చేరి "తెలుగులో వైకృతపదాలు" అనే అంశంపై పరిశోధించి 1966లో పి.హెచ్.డి సంపాదించారు. పరిశోధక విద్యార్థిగా ఉంటూనే 1954లో పూనాలోని దక్కన్ కళాశాలలో భాషా విజ్ఞానంపై సునీత కుమార్ ఛటర్జీ, సుకుమార్ సేన్ వంటి ఉద్దండుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా తరగతుల్లో శిక్షణ పొందారు. 1957లో సోమయాజి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" నిర్మాణ ప్రాజెక్టులో ముఖ్యసహాయకుడిగా చేరి 1961 వరకు పనిచేశారు.
1958లో ఆంధ్రా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఉపన్యాసకుడి(demonstrator)గా చేరారు.1970 నాటికి తెలుగు శాఖ ప్రధాన ఆచార్యుడిగా దోణప్ప నియమితులయ్యారు. 1970-76 వరకు "తెలుగు వ్యుత్పత్తి పదకోశం" ప్రాజెక్టు ముఖ్యసంపాదకుడిగా పనిచేశారు. 1976లో గుంటూరు జిల్లాలో ఏర్పాటైన నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు ప్రధాన ఆచార్యుడిగా 1980 వరకు పనిచేశారు. 1980- 85 వరకు యూనివర్సిటీ రిజిష్ట్రారుగా, కళాశాల అధ్యక్షులు(ప్రిన్సిపాల్)గా పనిచేశారు. అప్పటి సీఎం ఎన్టీఆర్ అభ్యర్థన మేరకు1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా, అంతర్జాతీయ తెలుగు సంస్థ డైరెక్టరుగా పనిచేశారు. 1986లో ఏర్పాటైన తెలుగు విశ్వవిద్యాలయం మొదటి ఉపకులపతి( వైస్ ఛాన్సలర్)గా పనిచేశారు.1994-95 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
దోణప్ప స్కూల్లో చదివే రోజుల్లోనే రచనలు చేయడం మొదలు పెట్టారు. ఎనిమిదో తరగతిలో ఉండగా రాసిన "చంద్రుడు-కలువ" కథ, మద్రాస్ నుంచి వెలువడే ఆనాటి హాస్యపక్ష పత్రిక " చిత్రగుప్త"లో అచ్చయింది. హైస్కూల్లో చదివే సమయంలోనే వినోదిని, రూపవాణి, ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు వంటి పత్రికల్లో పద్యాలు, గేయాలు, వ్యాసాలు పుంఖానుపుంఖాలుగా రాసేవారు. కళాశాలలో చదివే రోజుల్లో పద్యరచనలో, వ్యాసరచనలో ఎన్నో రివార్డులు పొందారు. "బైబిలు-ఖురాను-భగవద్గీత" అనే అంశంపై వ్యాసరచనచేసి మీనాక్షి సుందరాంబ స్మారక బహుమానాన్ని అందుకున్నారు. 1949లో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో ఆంధ్రప్రభ దినపత్రికలో తెలుగునాట ఉన్న మాండలికాలపై వ్యాసాలు రాశారు.
దోణప్ప గారికి భాషా పరిశోధనల పట్ల ఆసక్తి కలిగించింది చిలుకూరి నారాయణరావు గారు. భాషావేత్త, చరిత్రకారుడైన చిలుకూరి జీవిత చరమాంకంలో అనంతపురం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఆయన తరగతి పాఠాల కంటే తెలుగు భాషా వైభవం, ఆంధ్రుల చరిత్ర గురించి, కాలానికనుగుణంగా తెలుగు భాషలో మార్పులు చేర్పులు విఫులంగా చర్చించి దోణప్ప గారిని భాషా పరిశోధన వైపు మళ్లేలా చేశారు. తన గురువులైన చిలుకూరి, గంటి వారి స్పూర్తితో భాషా పరిశోధనలో నూతన శిఖరాలను అధిరోహించారు. భాషాభివృద్ధి పరిశోధనలో " దోణప్ప అంటే పరిశోధనలు, పరిశోధనలు అంటే దోణప్ప" అనే నానుడి వచ్చింది. కనుమరుగై పోతున్న వృత్తుల మండలికా పదాలు పుస్తక రూపం దాల్చడంలో వీరి పాత్ర కీలకం. ఆంధ్ర సాహిత్య పోషణ మీద వీరు రాసిన పుస్తకం ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక మైలు రాయిగా నిలిచింది. ఇవే కాకుండా వీరు రాసిన ప్రతి గ్రంథం నేడు తెలుగు భాషా పరిశోధక విద్యార్థులకు ప్రామాణిక గ్రంథాలుగా ఉపయోగపడుతున్నాయి.
దోణప్ప గారు అధ్యాపకుడిగా అసమానమైన కీర్తిని గడించారు. విద్యార్థులకు ప్రియమైన గురువుగా ఉంటూనే వారిని సక్రమ మార్గంలో నడిపించేందుకు క్రమశిక్షణ కలిగిన సంరక్షక బాధ్యతను సైతం తీసుకునేవారు. దోణప్ప గారి పాఠాలంటే విద్యార్థులు ఎంతో మక్కువ చూపించేవారు. ఆయన శిష్యరికంలో రాటుదేలిన విద్యార్థులు వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయన స్పూర్తితో అధ్యాపక వృత్తిలోకి వచ్చిన ఎంతో మంది తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు.
దోణప్ప గారు విద్యార్థి దశలో రంగస్థలం మీద రాణించారు. చింతామణి నాటకంలో 'చిత్ర' పాత్రధారిగా, 'సుభద్రా పరిణయం'లో సుభద్ర పాత్రను, 'మోహినీరుక్మాంగద'లో రుక్మాంగద పాత్రను ధరించి అనేక పతకాలను పొందాడు. పుట్టపర్తి సత్యసాయిబాబాగా నీరాజనాలు అందుకుంటున్న పూర్వాశ్రమంలో రత్నాకరం సత్యనారాయణరాజు గారు విద్యార్ధి దశలో నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించగా వారికి జత కలిసి భర్తగా అనేక నాటకాల్లో పాత్రధారణ చేశాడు.సాయిలీల అనే నాటకంలో ఒకసారి సాయిబాబాగా, ఒకసారి శిష్యుడిగా, మరోసారి మహావిష్ణువుగా నటించారు. తదనంతర కాలంలో రంగస్థల కళాకారులకు ప్రభుత్వాల నుంచి ఆర్థిక ప్రోత్సాహాకాలు ఇప్పించారు.
నాలుగున్నర దశాబ్దాల వృత్తి జీవితంలో తూమాటి దోణప్ప గారు ఉత్తమ అధ్యాపకులుగా, ఆదర్శ పరిశోధకులుగా, నిత్యవిద్యార్థిగా, పరిపాలనా దక్షులుగా, కార్యదీక్షాపరులుగా, ప్రామాణిక రచయితగా తెలుగు భాషాభివృద్ధికి అలుపెరగని కృషి చేశారు. తెలుగు భాషా పరిశోధన రంగంలో తనదైన ముద్ర వేసిన దోణప్ప గారు 1996, సెప్టెంబర్ 6న హైదరాబాదులోని తన స్వగృహంలో కన్నుమూశారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ