ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం..ఏక్యూఐ 500

- November 19, 2024 , by Maagulf
ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయుకాలుష్యం..ఏక్యూఐ 500

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) గత ఏడు రోజులుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. మంగళవారం ఉదయం ఆనంద్‌ విహార్‌తో సహా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 500కి చేరుకుంది. ఢిల్లీలోని విషవాయువు స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీవాసులు ఎయిర్‌ ప్యూరిఫైయర్లు, మాస్క్‌లను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఢిల్లీలోని ఏక్యూఐ ‘చాలా తీవ్రమైన’ కేటగిరీకి చేరుకుంది. ఏక్యూఐ 484గా నమోదైంది.

కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లా(గ్రాప్‌)-4 కింద ఆంక్షలను తక్షణమే విధించాలని జాతీయ రాజధాని ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 10, 12 తరగతులు మినహా మిగిలిన తరగతుల వారికి తరగతులను నిలిపివేయాలని నిర్ణయించింది. వీరికి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నారు. ప్రమాదకరమైన విషపూరిత గాలి నుండి విద్యార్థులను కాపాడేందుకే ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పాఠశాలలు పనిచేయనున్నాయి. అయితే వీరికి కూడా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, రాజధానిలో విషపూరిత పొగమంచు కారణంగా దృశ్యమానత పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాజధానికి రాకపోకలు సాగించే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో తొమ్మిది రైళ్లను అధికారులు రద్దు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com