ఇండియన్ సెక్యూరిటీ మ్యాన్-అజిత్ దోవల్
- January 20, 2025
అజిత్ దోవల్... ప్రస్తుత భారతదేశ ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి. ప్రధాని మోదీకి నమ్మిన బంటుగా ఉన్న దోవల్ ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ వ్యవహారాల్లో ఆయనకున్న విశేషమైన అనుభవం మూలంగానే సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ ను భారత సైన్యం విజయవంతంగా నిర్వహించింది. దేశ అంతర్గత భద్రతా వ్యవహారాలను చక్కబెడుతూనే అంతర్జాతీయ వేదిక మీద భారత్ కీర్తిని పెంచేందుకు దోహదపడుతున్నారు. నేడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పుట్టినరోజు.
అజిత్ దోవల్ 1945, జనవరి 20న బ్రిటిష్ ఇండియాలో భాగమైన యునైటెడ్ ప్రావిన్స్ పౌరి గర్వాల్ జిల్లా గిరి బనేల్సున్ గ్రామంలో జన్మించారు.దోవల్ కుటుంబం తోలి నుంచి భారత దేశ సేవలోనే ఉంది.తాత, తండ్రి బ్రిటిష్ ఇండియన్ మరియు ఇండియన్ ఆర్మీల్లో పనిచేశారు. తండ్రి ఆర్మీ అధికారి దోవల్ బాల్యం మొత్తం వివిధ ప్రాంతాల్లో సాగింది.అజ్మీర్ మిలటరీ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన దోవల్ ఎన్డీయే పరీక్ష రాసి ఇండియన్ ఆర్మీ అకాడమీకి ఎంపికై అక్కడ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
దోవల్ 1968లో ఐపీఎస్ రాంక్ సాధించి కేరళ క్యాడర్కు ఎంపికయ్యారు. కొంతకాలం ఆ రాష్ట్రంలోని కొట్టాయం, తలస్సేరిలో ఏఎస్పీగా పనిచేశారు. 1972లో సెంట్రల్ సర్వీస్కు దరఖాస్తు పెట్టుకొని ఇంటలిజెన్స్ బ్యూరో(IB)లో చేరారు. దోవల్ 1970 మధ్యలో ఐబీ తరపున పాకిస్తాన్లో సుమారు 7 ఏళ్ళ పాటు పనిచేశారు. ఆ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాద వ్యవస్థ గురించి కీలక సమాచారాన్ని భారతదేశానికి చేరవేశారు. పాకిస్తాన్ తర్వాత మిజోరామ్ వ్యవహారాల్లో ఆయన పనిచేయడం మొదలు పెట్టారు.
1980ల్లో మిజో నేషనల్ ఆర్మీ (ఎమ్ఎన్ఏ)లో ఒకరిగా చేరి మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్రస్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేశారు. ఆ సమయంలో ఎమ్ఎన్ఏ అధినేత బైక్చ్చుంగాకు ఎంతో సన్నిహితుడయ్యారు. ఒక దశలో ‘దోవల్ మాటల్ని వింటే మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుంద’ని వారి నాయకుడు లాల్డెంగా ఆ అధినేతను హెచ్చరించాడట. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో లాల్డెంగా ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ‘దోవల్వల్లనే ఆ ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది. నా కింద ఏడుగురు మిలటరీ కమాండర్స్ ఉండేవారు. వారిలో ఆరుగురిని దోవల్ నా నుంచి దూరం చేశారు’ అని లాల్డెంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలా 20 ఏళ్లపాటు సైన్యానికి తలనొప్పిగా ఉన్న ఎమ్ఎన్ఏ సమస్యకు ముగింపు పలికారు దోవల్. చాలామంది తమ కెరీర్ మొత్తంలో చేయలేని పనిని దోవల్ స్వల్ప వ్యవధిలో చేశారంటూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కితాబిచ్చారు. అదే సమయంలో దోవల్ సేవలకు గానూ ‘ఇండియన్ పోలీస్ మెడల్’ను ప్రదానం చేయడం జరిగింది. ఈ మెడల్ అందుకున్న పిన్న వయస్కుడు దోవల్.
1988 ప్రాంతంలో ‘opration blue star పేరుతో స్వర్ణదేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ని ప్రభుత్వం చేపట్టినపుడు దోవల్ కీలక పాత్ర పోషించారు. ఒక రిక్షావాలాగా వేషం మార్చి ఖలిస్తాన్ తీవ్రవాదులతో మాట కలిపి తనను పాకిస్థాన్ ఏజెంట్గా పరిచయం చేసుకున్నారు. ఆపరేషన్ నిర్వహణకు కొద్ది రోజులు ముందు అమృతసర్ స్వర్ణ దేవాలయంలోకి వెళ్లి ఉగ్రవాదుల ఆయుధ బలం, సంఖ్యా బలం, బలగాల మోహరింపుని క్షుణ్ణంగా పరిశీలించి సమాచారాన్ని భద్రతాదళాలకు అందించారు. సైన్యం ఆ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో స్వర్ణదేవాలయం లోపలే ఉండి ఉగ్రవాదుల ఏరివేతకు విలువైన సమాచారాన్ని చేరవేశారు కూడా. దాంతో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడంతోపాటు ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం ఆ ఆపరేషన్ పూర్తిచేయగలిగింది. ‘తీక్షణమైన పరిశీలనా శక్తి, అంతుచిక్కని నవ్వు...’ దోవల్ ప్రత్యేకతలని చెబుతారు ఆ ఆపరేషన్లో పాల్గొన్న ఓ నిఘా అధికారి. ఆ ఆపరేషన్కుగానూ దోవల్ ‘కీర్తి చక్ర’ అవార్డుని అందుకున్నారు. సైన్యంలో పనిచేసేవారికే అప్పటివరకూ ఆ అవార్డు ఇచ్చేవారు. దోవల్ ఆ అవార్డు అందుకున్న మొదటి పోలీసు అధికారి.
1990-96 వరకు జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో పనిచేసిన దోవల్, ఆ రాష్ట్రంలో నెలకొన్న హింసాయుత పరిస్థితులను చక్కబెట్టేందుకు పలు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు. వేర్పాటువాదిగా ఉన్న కుకా పర్రయ్ లొంగిపోయేలా చేయడమే కాకుండా అతడి మనసు మార్చి భారత ప్రభుత్వానికి అనుకూలంగా తయారుచేశారు. తర్వాత ఓ సంస్థను ప్రారంభించి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశాడు పర్రయ్. ప్రభుత్వ ఏజెంట్గా పనిచేయడం గురించి అక్కడ కొందరికి శిక్షణ కూడా ఇచ్చారు. మరోవైపు వేర్పాటువాద గ్రూపుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపేలా వాతావరణంలో మార్పు తెచ్చారు. రాజకీయంగానూ అదో కీలక మలుపు. ఆ చర్యలతో 1996లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో తన వంతు పాత్ర పోషించారు. ఆ సమయంలో దిల్లీ వర్గాలు దోవల్ పనితనాన్ని ఎంతగానో కొనియాడాయి. కొన్నిసార్లు ఆయన్ని విమర్శించినవారు కూడా ఆ విజయంతో ప్రశంసించారు. అంతవరకూ గూఢచారిగా పేరుతెచ్చుకున్న దోవల్... వ్యూహకర్తగానూ గుర్తింపు సంపాదించారు.1996-99 వరకు లండన్ భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు.
1999లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన కాఠ్మాండూ-దిల్లీ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసి కాందహార్ తరలించిన సమయంలో బందీలను విడిపించడంకోసం తీవ్రవాదులతో చర్చించిన బృందంలో దోవల్ ఒకరు. అంతకు ముందు కూడా ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాల హైజాకింగ్ సంఘటనల సమయంలోనూ దోవల్ చర్చలకు వెళ్లారు. కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాల్నీ, నిఘా వర్గాల్నీ సమన్వయం చేసేందుకు ‘మల్టీ ఏజెన్సీ సెంటర్’ను ఏర్పాటుచేసి దాని సారథ్య బాధ్యతలు దోవల్కు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో ఏర్పాటైన మరో నిఘా విభాగం ‘జాయింట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్’కూ సారథ్యం వహించేవారాయన.
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నాటి హోం మంత్రి ఎల్.కె.అద్వానీకి సన్నిహితంగా ఉండేవారు. మన్మోహన్ సింగ్ మొదటిసారి ప్రధాని అయ్యాక దోవల్ని ‘ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్’గా నియమించింది యూపీఏ. కానీ ఆ స్థానంలో ఆయన ఎనిమిది నెలలే ఉన్నారు. 2005లో అధికారికంగా రిటైరైనా, ఆ తర్వాత కూడా అనధికారికంగా ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లకు వ్యూహకర్తగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత దావూద్ ఇబ్రహీంని మట్టుబెట్టే ఆపరేషన్కు ఆయన స్కెచ్ గీశారు. దావూద్ కూతురు పెళ్లికి దుబాయ్లోని హోటల్కు వచ్చినపుడు చంపాలన్నది ప్రణాళిక. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో ఛోటా రాజన్ ముఠాకు చెందిన ఇద్దర్ని అందుకు సిద్ధం చేశారు దోవల్. ఆ దశలో ముంబయి పోలీసు వర్గాల్లో దావూద్కు అనుకూలంగా ఉన్నవారు ఆ పని కానివ్వలేదు. దిల్లీలో ఛోటా రాజన్ అనుచరులతో దోవల్ మంతనాలు జరుపుతున్న హోటల్కు వచ్చి తీవ్రవాదులంటూ వారిద్దరినీ అరెస్టు చేసి దోవల్ మాట చెల్లనివ్వకుండా చేశారు.
ఐబీ డైరెక్టర్గా దోవల్ రిటైరయ్యాక ‘వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్’ అనే వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. భద్రత, దౌత్య, సైనిక విభాగాల్లో పనిచేసిన మాజీ అధికారులు సభ్యులుగా ఉండే ఈ సంస్థలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన మేథోపరమైన చర్చలు జరుగుతుంటాయి. అవి ప్రభుత్వ విధానాలకూ పనికొచ్చేవి.
ఈశాన్య భారత్, పంజాబ్, కశ్మీర్... భారత్ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నాసరే అక్కడికి వెళ్లి వారి భరతం పట్టడానికి తన ప్రతిభాపాటవాల్ని ఉపయోగించేవారు దోవల్. అంతేకాదు, ఏడేళ్లపాటు పాకిస్తాన్లో గూఢచారిగానూ ఉన్నారు. లాహోర్లో ఒక ముస్లిం వేషంలో ఉండేవారు దోవల్. ఆ సమయంలో పాక్తోపాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ అనుకూల ఏజెంట్లను నియమించారు. క్షేత్రస్థాయిలో తానుగా లేదంటే, ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించడం, దాన్ని భద్రతా దళాలకు చేరవేసి విద్రోహ శక్తుల్ని కోలుకోలేని దెబ్బకొట్టడం దోవల్కు వెన్నతో పెట్టిన విద్య.
2014లో మోడీ ప్రధాని అయ్యాక దోవల్ని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)గా నియమించారు. వివిధ ఆపరేషన్లలో క్షేత్రస్థాయి అనుభవం ఉన్న మొదటి ఎన్ఎస్ఏ అయిన దోవల్కి చేతల మనిషిగా గుర్తింపు ఉంది. అప్పుడే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తన స్థావరాన్ని కరాచీ నుంచి పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లోకి మార్చుకున్నాడనీ చెబుతారు. రా, ఇంటెలిజెన్స్ బ్యూరోలు సేకరించిన సమాచారాన్ని జాతీయ భద్రతా సలహాదారుతోనే పంచుకుంటాయి. దాన్నిబట్టి ఎన్ఎస్ఏగా దోవల్ పాత్ర ఎలాంటిదో అర్థమవుతుంది.
ఎన్ఎస్ఏగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే ఇరాక్లో ఐసిస్ దాడుల్లో చిక్కుకున్న 45 మంది భారతీయ నర్సుల్ని అత్యంత క్షేమంగా స్వదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు దోవల్. 2015 జనవరిలో జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి అన్నింటా చైనాకు వత్తాసు పలుకుతున్న అప్పటి అధ్యక్షుడు మహింద రాజపక్సను గద్దె దించడంలోనూ దోవల్ వ్యూహ రచన చేశారంటారు.
మణిపూర్లో మన సైన్యానికి సంబంధించిన వాహనశ్రేణిపైన దాడిచేసి 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న తీవ్రవాదులపైన ప్రతీకారంగా వారాల వ్యవధిలో సైన్యం మయన్మార్లోకి వెళ్లి మెరుపుదాడి చేసి 40 మంది తీవ్రవాదుల్ని హతమార్చింది. గత అక్టోబరులో మయన్మార్ ప్రభుత్వం అతివాద వర్గాలతో శాంతి ఒప్పందం చేసుకున్నపుడు దోవల్ అక్కడే ఉండి ఆ కార్యక్రమాన్ని పరిశీలించారు.
బంగ్లాదేశ్లో తలదాచుకుంటున్న ఉల్ఫా ప్రధాన కార్యదర్శి అనూప్ ఛేతియాని తన మంత్రాంగంతో ఆ దేశం మనకు అప్పగించేలా చేశారు. సరిహద్దు వివాదాలు పరిష్కరించుకోవడం సహా చాలా అంశాల్లో సానుకూలంగా స్పందించిన బంగ్లాదేశ్ మనకు సన్నిహితమైన పొరుగుదేశమంటూ బహిరంగంగానే ప్రకటించారు దోవల్. ఐబీ మాజీ డైరెక్టర్ సయ్యద్ ఆసిఫ్ ఇబ్రహీమ్ను 2015లో తీవ్రవాదం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ప్రధానమంత్రి ప్రత్యేక రాయబారిగా పశ్చిమాసియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలతో చర్చించేందుకు నియమించారు. ఇదివరకు ఇలాంటి రాయబారి హోదా లేదు. అదే సమయంలో పశ్చిమాసియా, ఆగ్నేయాసియా దేశాల్లో నిఘా వర్గాలు చురుగ్గా పనిచేసేలా దోవల్ మార్పులు తెచ్చారనీ, అందువల్లే ఛోటా రాజన్ను పట్టుకోగలిగారనీ చెబుతారు.
2016లో పఠాన్కోట్ భారత సైనిక స్థావరంపై పాక్ తీవ్రవాదుల దాడులకు ప్రతీకారంగా దోవల్ మార్గనిర్దేశకత్వంలో భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఊరి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను విజయవంతంగా జరిపాయి. ఈ మెరుపు దాడులను ఊరి సర్జికల్ స్ట్రైక్స్ అని కూడా అంటారు. ఈ దాడులు జరగడంలో నాటి రక్షణ మంత్రి దివంగత మనోహర్ పారికర్, అజిత్ దోవల్లు కీలకం. వీరిద్దరి పరస్పర సమన్వయంలోనే ఆ దాడులు విజయవంతంగా సాగాయి. 2019 ఎన్నికల సమయంలో సైతం పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రమూకల దాడుల్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి ప్రతీకారంగా భారత వాయుసేన జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ వెనుక సైతం దోవల్ పాత్ర ఉంది. ఈ రెండు మెరుపు దాడుల వల్ల భారత రక్షణ సేనల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసివచ్చేలా చేశారు దోవల్. ఇదే ఎయిర్ స్ట్రైక్స్ దాడుల్లో భారత పైలట్ అభినందన్ వర్దమాన్ పాకిస్తాన్ సేనలకు పట్టుబడగా, తన దౌత్యనీతితో అమెరికా ద్వారా పాకిస్తాన్ పై ఒత్తిడి చేయించి పైలట్ విడుదలకు మార్గం సుగుమం చేశారు.
10 ఏళ్ళ పాటుగా ఎన్ఎస్ఏగా కొనసాగుతున్న దోవల్ భారత రక్షణ వ్యవస్థ పటిష్టత, అంతర్జాతీయ సమాజంతో భారతదేశానికి బలమైన రక్షణ సంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తూనే ఉన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న దోవల్కు ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు మోడీ సైతం ఎల్లప్పుడూ తన సంసిద్ధతను వ్యక్తం చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో మోడీ, షాల తర్వాత మూడో స్థానంలో దోవల్ ఉన్నారు.
--డి.వి.అరవింద్(మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!