దాయాదుల పోరులో గెలుపెవరిది?

- February 23, 2025 , by Maagulf
దాయాదుల పోరులో గెలుపెవరిది?

దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఈరోజు దుబాయ్ లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పైనే అందరి దృష్టీ నెలకొంది.కేవలం ఈ రెండు దేశాలే కాకుండా మొత్తం క్రికెట్ అభిమానులకు ఆసక్తి రేపే మ్యాచ్ ఇది.ఈ మ్యాచ్ ఎంతటి ప్రతిష్టాత్మకమైందంటే ఏకంగా కొత్త కోచ్ నియమించుకుంది పాకిస్తాన్.  

ఇండియా కంటే పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే పాకిస్తాన్ ఇక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.ఇండియాకు కూడా గెలుపు అవసరమే కానీ పాకిస్తాన్ అంత కానే కాదు. పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ చావో రేవో తేలుస్తుంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్ల మానసిక పరిస్థితి విభిన్నంగా ఉంది. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమ్ ఇండియా ఉత్సాహంగా ఉంది. పాకిస్తాన్ మాత్రం న్యూజిలాండ్‌తో ఓటమి, చావో రేవో తేల్చే మ్యాచ్ కావడం వల్ల తీవ్రమైన ఒత్తిడిలో ఉంది

టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు లేదా ముగ్గురు రాణించినా భారీ స్కోర్‌కు తిరుగు ఉండదు. అదే విధంగా బౌలింగ్‌లో మొహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలతో బలంగా ఉంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి వస్తే ఇక స్పిన్ పటిష్టంగా మారుతుంది. 


పాకిస్తాన్ విషయానికొస్తే బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. పాకిస్తాన్‌కు ఇది చావో రేవో మ్యాచ్ అయినందున మాజీ క్రికెటర్ ముదస్సర్ నాజిర్‌‌ను నియమించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. 


ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 135 వన్డేల్లో తలపడగా టీమ్ ఇండియా 57 సార్లు గెలిస్తే పాకిస్తాన్ 73 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 5 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పరిశీలిస్తే పాకిస్తాన్ మూడింటి, టీమ్ ఇండియా 2 మ్యాచ్‌లలో విజయం సాధించింది. చివరిసారిగా 2017లో పాకిస్తాన్..టీమ్ ఇండియాపై విజయం సాధించడమే కాకుండా టైటిల్ గెలిచింది. ఏడేళ్ల తరువాత తిరిగి అదే ట్రోఫీలో తలపడుతున్నాయి. 

 --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com