నత్తనడకన ఇ-శ్రమ్‌ రిజిస్ట్రేషన్లు

- February 28, 2025 , by Maagulf
నత్తనడకన ఇ-శ్రమ్‌ రిజిస్ట్రేషన్లు

న్యూఢిల్లీ: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు వలస కార్మికుల నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో ప్రారంభించిన ఇ-శ్రమ్‌ పోర్టల్‌ పనితీరు ఆశాజనకంగా కన్పించడం లేదు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసంఘటిత కార్మికుల సమాచారాన్ని నమోదుచేయడానికి కేంద్రం రూ.704 కోట్ల బడ్జెట్‌తో ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. 2021 డిసెంబర్‌ 31 లోగా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.వలస కార్మికుల నమోదును చేపట్టి, ఆ సమాచారాన్ని కేంద్రానికి అందజేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పొందాలంటే కార్మికులు విధిగా ఈ పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.అయితే కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నత్తనడక నడుస్తోంది. నమోదులో పురోగతిని తెలియజేసే నివేదికను అందించడానికి మరింత సమయం ఇవ్వాలని 2022 మార్చి 18న సుప్రీంకోర్టును కేంద్రం అభ్యర్థించింది. ఆ సమయానికి 27.45 కోట్ల మంది అసంఘటిత కార్మికులు పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఇక వలస కార్మికుల నమోదుకు సంబంధించి అనేక రాష్ట్రాలు వెనుకబడిపోయాయి. మహారాష్ట్ర 36.07 శాతం, తమిళనాడు 34.48 శాతం, తెలంగాణ 34.9 శాతం, గుజరాత్‌ 48.4 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నాయి.దీంతో కోర్టు ఆయా రాష్ట్రాలకు మరో ఆరు వారాల గడువు ఇచ్చింది.

2021 ఆగస్ట్‌ 26న ప్రారంభమైన ఇాశ్రమ్‌ పోర్టల్‌ నిర్వహణ కోసం 2019-20, 2024-25 మధ్యకాలానికి కేంద్ర ప్రభుత్వం రూ.704 కోట్లు కేటాయించింది.అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమాచారాన్ని ఆధార్‌తో అనుసంధానిస్తారు.ఈ సమాచారంలో కార్మికుడి పేరు, వృత్తి, చిరునామా, వృత్తి ఏ తరహాకు సంబంధించింది, విద్యార్హతలు, నైపుణ్యం, కుటుంబ వివరాలు ఉంటాయి.59 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండి, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ వంటి వ్యవస్థల్లో సభ్యులు కాని వారి వివరాలు మాత్రమే ఇాశ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న ఎనిమిది కోట్ల మంది కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయాలని 2023 ఏప్రిల్‌ 20న సుప్రీంకోర్టు ఆదేశించడంతో దానికి ప్రాధాన్యత ఏర్పడింది. అదే విధంగా మరో ఎనిమిది కోట్ల మందికి కూడా రేషన్‌ కార్డులు ఇవ్వాలని గత సంవత్సరం మార్చి 19న న్యాయస్థానం ఆదేశించింది.

వెనుకబడిపోయిన రాష్ట్రాలు
2020ా21 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో కార్మికుల సంఖ్య 53.53 కోట్లు. వీరిలో 43.99 మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. 2024 మార్చి 31 నాటికి 29.51 కోట్ల మంది మాత్రమే ఇాశ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. అంటే దేశంలోని అసంఘటిత రంగ కార్మికుల్లో మూడింట రెండు వంతులకు పైగా (67.08 శాతం) పోర్టల్‌లో నమోదై ఉన్నారు. అయితే ఇది 2020-21లో కార్మికుల సంఖ్య ఆధారంగా వేసిన లెక్క. ఆ తర్వాత ఇాశ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. 2024 మార్చి 31న 29.51 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య ఈ సంవత్సరం ఫిబ్రవరి 19 నాటికి 30,65,04,015కి చేరింది. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయమేమంటే 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ రేటు జాతీయ సగటు రేటు (63.25 శాతం) కంటే తక్కువగా ఉంది. ఉత్తరాఖండ్‌ (95.05 శాతం), ఢిల్లీ (91.74 శాతం), బీహార్‌ (82.49 శాతం) రాష్ట్రాలు మాత్రమే మెరుగైన రిజిస్ట్రేషన్‌ రేటు సాధించాయి.

రాష్ట్రాల పనితీరు ఇలా…
వాస్తవానికి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కార్మికుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఒడిషా (78.58 శాతం), జార్ఖండ్‌ (73.68 శాతం), పశ్చిమ బెంగాల్‌ (66.39 శాతం), హర్యానా (65.38 శాతం), ఛత్తీస్‌గఢ్‌ (63.68 శాతం) మంచి పనితీరు కనబరిచాయి. అదే సమయంలో బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన తెలంగాణ (30.91 శాతం), తమిళనాడు (34.63 శాతం), మహారాష్ట్ర (37.20 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (40.04 శాతం), గుజరాత్‌ (42.20 శాతం), కర్నాటక (45.92 శాతం)లో రిజిస్ట్రేషన్‌ రేటు తక్కువగా ఉంది. కేరళ ఇటీవలే 50 శాతం రేటును దాటింది.అక్కడ 17.93 కోట్ల మంది అసంఘటిత కార్మికులు నేటికీ తమ వివరాలు పోర్టల్‌లో నమోదు చేసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వంద శాతం రిజిస్ట్రేషన్లు జరగడానికి సంవత్సరాలే పట్టేలా ఉంది.

ఏం చేయాలంటే…
ఇాశ్రమ్‌ అనేది స్వచ్ఛందంగా జరుగుతోంది. తప్పనిసరి రిజిస్ట్రేషన్‌ కాకపోవడంతో కార్మికులు పెద్దగా ముందుకు రావడం లేదు. పైగా కార్మికులు తమంత తాముగా వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్‌లో వివరాల నమోదుకు కొంత ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నగదు బదిలీ వంటి చర్యల ద్వారా ఆర్థిక ప్రయోజనం కల్పిస్తే కార్మికులు మరింత ఉత్సాహంగా తమ వివరాలు నమోదు చేసుకుంటారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఇాశ్రమ్‌ పోర్టల్‌పై పెద్దగా ప్రచారం జరగడం లేదు. కొందరు ఇంటి పనివారు, వీధి వ్యాపారులకు దీని గురించే తెలియదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు యజమానులు, కాంట్రాక్టర్ల ద్వారా తమ వద్ద పనిచేస్తున్న కార్మికుల పేర్లు పోర్టల్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇాశ్రమ్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకునే కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సౌకర్యాలు ఉండకూడదు. సంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు, చిన్న, మధ్య తరహా సంస్థల్లో పనిచేస్తున్న వారు ఈ రెండు సౌకర్యాలనూ పొందుతూనే ఉన్నారు. దీంతో వారు ఇాశ్రమ్‌ పోర్టల్‌లో చేరలేకపోతున్నారు. ఇాశ్రమ్‌ పోర్టల్‌లో వలస కార్మికులు, గిగ్‌ వర్కర్ల సమాచారం లభించడం లేదు. పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్న వారిలో అత్యధికులు (52.13 శాతం) వ్యవసాయ కార్మికులే. అయితే వారి కోసం ఎలాంటి చట్టాలు అమలులో లేవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com