తొలిసారిగా ఒక ఆర్థిక నేరస్తుడిని బహ్రెయిన్ నుంచి భారత్ కు రప్పించిన సిబిఐ

- October 16, 2018 , by Maagulf
తొలిసారిగా ఒక ఆర్థిక నేరస్తుడిని బహ్రెయిన్ నుంచి భారత్ కు రప్పించిన సిబిఐ

న్యూఢిల్లీ : విదేశాలుకు పారిపోయిన ఒక ఆర్థిక నేరస్తుడిని తిరిగి భారత్‌కు రప్పించడంలో సిబిఐ వర్గాలు తొలిసారిగా విజయం సాధించాయి. బెంగళూరుకు చెందిన ఆర్థిక నేరస్తుడు మహ్మద్‌ యాహ్యా (47) ను బహ్రెయిన్‌లో అరెస్టుచేసి ఎయిరిండియా విమానంలో శుక్రవారం ఉదయం ఢిల్లీ తీసుకు వచ్చారు. అక్కడ నుండి మరింత దర్యాప్తు కోసం బెంగళూరు తరలించారు. 2003లో రూ.46 లక్షల మేర రెండు బ్యాంకులను యాహ్యా మోసగించాడు. దీనిపై సిబిఐ 2009లో దర్యాప్తు ప్రారంభించింది. అప్పటికే యాహ్యా బహ్రెయిన్‌కు పారిపోయాడు. దర్యాప్తు పూర్తయిన తరువాత సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. ప్రత్యేక సిబిఐ కోర్టు యాహ్యాను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. నేర కుట్ర, విశ్వాస ఉల్లంఘన నేరం, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి నకిలీ పత్రాలతో రుణాలు తీసుకోవడం, ఉద్దేశపూర్వకంగా వాటిని చెల్లించకపోవడం తదితర అభియోగాలను యాహ్యాపై సిబిఐ నమోదు చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వ అభ్యర్ధనపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయడంతో కొన్ని నెలల క్రితం బహ్రెయిన్‌ అధికారులు యాహ్యాను గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం భారత ప్రభుత్వం ఉన్నత స్థాయిలో బహ్రెయిన్‌ అధికారులతో సంప్రదించి, అతన్ని భారత్‌కు తీసుకు వచ్చే ఏర్పాట్లు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com