ప్రపంచ పుస్తక దినోత్సవం
- April 23, 2025
పుస్తకం ఓ మంచి నేస్తం. కాలక్షేపంగా ఊసుపోవడానికి కొందరికి, విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరికొందరికి సాయపడుతుంది. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి దారి చూపెట్టే సాధనమూ అదే. మనోవికాసానికి, మార్గనిర్దేశానికి గురువులా ఉపయోగపడుతుంది. అందుకే జీవితంలో నిజమైన నేస్తం పుస్తకం. మానవజీవన గమనం, విధానంలో పుస్తకాలు వచ్చాక విప్లవాత్మక మార్పులు వచ్చాయంటే నమ్మాల్సిందే. ఈనాటి సమాజంలో ఆధునిక జీవన విధానం చుట్టుముడుతున్న ఈ రోజుల్లోనూ పుస్తక పఠనాన్ని ఇష్టపడేవారూ గణనీయంగానే ఉన్నారు.
ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తోంది. పుస్తకాన్ని చదవడం కనుక మనం అస్వాదించగలిగితే అది తృప్తినిస్తుంది.. పుస్తకం అమ్మలా లాలిస్తుంది.. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది.. మన ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది... బాధపడే వారిని ఓదారుస్తుంది . అలసిన మనసులను సేద తీర్చుతుంది.. అందుకే పుస్తకం అనితరమైన ఆయుధంగా, నేస్తంగా సమస్తంగా అన్ని తరాలవారినీ అలరిస్తోంది. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం మీకోసం...
‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో...కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ అని కందుకూరి వీరేశలింగం పంతులు చెప్పిన మాటలు నేటికి పుస్తక ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి.పుట్టిన బిడ్డ మొదలు పెద్దలు వరకు ఏదో ఒకటి నేర్చుకోవాలని తపనపడేవారే. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థే. విద్యతో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే పుస్తకాల దుకాణానికి వెళ్లి మంచి పుస్తకం కొని చదవటం వల్ల విజ్ఞాన ప్రపంచంలోకి అడుగుపెడతారు.
ప్రస్తుతం కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు కొదవేలేదు. సినిమాలు, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్ మాయలెన్ని దరిజేరినా పుస్తకం విలువ చెక్కు చెదరలేదు.‘మనల్ని గుచ్చి గాయపరిచి, ఇబ్బందిపెట్టే రచనల్నే మనం చదవాలి. మనం చదువుతున్న పుస్తకం తలపై ఓ మొట్టికాయవేసి మనల్ని మేల్కొలపాలి . లేనిపక్షంలో అసలు చదవడం ఎందుకు ? మంచి పుస్తకం ఒక దుస్సంఘటన లాగా మనల్ని ప్రభావితం చేయాలి. మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తుల మరణం లాగా మనల్ని తీవ్రంగా కలచివేయాలి. అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించేలా ప్రేరేపించాలి. పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలాగా పగలగొట్టాలి’ అంటాడు ప్రముఖ రచయిత కాఫ్కా.
ఏప్రిల్ 23 రోజున ప్రపంచ పుస్తక దినోత్సవంగా పరిగణించడంపై విభిన్న కథనాలున్నాయి. 17వ శతాబ్దంనాటి యూరప్లో ఈ రోజును సెయింట్ జార్జ్ డేగా పాటించేవారు. స్పెయిన్లో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా ఈ పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఒక కారణం.
ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహోత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రకటిస్తూ వస్తోంది.
ప్రపంచంలో ఏదేశ వాసులు ఎక్కువసేపు పుస్తకాలు చదువుతారు అనే విషయంపై ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువసేపు పుస్తకాలు చదివేవారు భారతీయులేనట. అవును.. ఇండియన్లు వారానికి సగటున 10.2 గంటలపాటు పుస్తకపఠనం చేస్తారని దశాబ్దం క్రితమే చేసిన ఒక అధ్యయనం తేల్చింది. 2019 నాటి సర్వేలో ఈ సమయం 10.4 గంటలకు పెరిగింది.
టీవీలు, సినిమాలు, ఇంటర్నెట్ వినియోగం.. మారుతున్న జీవనశైలి కారణంగా ఇటీవలికాలంలో మనలో పుస్తకపఠనంపై మోజు తగ్గిందనుకుంటున్నాంగానీ ఈ విషయంలో ఇప్పటికింకా మనమే టాప్. ఈ సంఖ్య మరింత పెరగాలని పుస్తకాలు చదవడంలో ఎప్పటికీ భారతీయులే అగ్రస్థానంలో ఉండాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు.
పుస్తకాలు చదవడం వలన జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు.
పుస్తకంలోని అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకున్ని తనలో లీనం చేసుకుంటుంది. ఇక విజ్ఞాన్ని అందించే భాంఢాగారం పుస్తకం. ఉదయాన్నే ఛాయ్ తాగినప్పుడు మొదటి చప్పరింపు ఎంత హాయిని ఇస్తుందో పుస్తకం అంతే హాయ్ని ఇస్తుంది అంటారు కొందరు. అందువలన అందరూ కనీసం రోజుకు ఒక్క పుస్తకమైనా చదవాలని చెబుతుంటారు పెద్దలు.
మనిషి మేధస్సును, విజ్ఞానాన్ని పెంపొందించడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే తుదివరకు అది మనిషి జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. మహోన్నత విజ్ఞానాన్ని అందించేది పుస్తకం. అందుకే పుస్తకం ఎప్పుడూ మన చేతిని అలంకరించి ఉండాలని చెప్పారు పెద్దలు. కాలక్రమేణా పుస్తకాలలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ బుక్స్ వచ్చాయి. కానీ పుస్తక పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు.
ఎలక్ట్రానిక్ బుక్స్ని ఈ బుక్స్ అంటున్నాం మనం. ఇవి ఇప్పటివి కావు, ఇరవై ఏళ్ళుగా ఇవి అందుబాటులో ఉన్నాయి. మొదటి ఎలక్ర్టానిక్ బుక్కి ఎక్కువ సమాచారం, నిక్షిప్తం చేసుకునే కెపాసిటీ లేదు. స్క్రీన్ కూడా అతిచిన్న సైజులో ఉండేది. 1991లో తయారు చేసిన ఎలక్ట్రానిక్ బుక్స్ బైబిల్. దీనిలో ఒక్కసారికి కేవలం నాలుగు లైన్లు మాత్రమే కనిపించేవి. కానీ ఇటీవల కాలంలో మొబైల్ఫోన్లో కూడా ఈ బుక్ అందుబాటులోకి వచ్చింది. ఇలా పుస్తకం తన రూపం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వినూత్నంగా తన విశిష్టతను నిలబెట్టుకుంటోంది. కానీ ఎలక్ట్రానిక్ బుక్స్ వల్ల కాస్త కనుమరుగు అవుతోంది. పెరుగుతున్న విజ్ఞానంతో పుస్తకం మరింత ఆధునీకరణ చెందుతుందని ఆశిద్దాం.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. ఏదైనా చదవాల్సి వస్తే ఆన్లైన్లోనో, కిండిల్ నోట్లోనో చదువుతున్నారు. పుస్తకాలను పట్టుకొని చదవడం ప్రజలు మర్చిపోతున్నారనే చెప్పాలి. అందుకే పలు స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినట్టుగా ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే కొందరు ఆర్టిస్టులు రోడ్డుపై ‘పుస్తకాల నది’ ఏర్పాటు చేశారు. పుస్తక పఠనంపై ఆసక్తి, అవగాహన పెంచేందుకు స్పెయిన్కి చెందిన ‘లుజింటెరప్టస్’ అనే సోషల్ ఆర్టిస్టు బృందం కెనడాలోని టొంరొంటోలో రద్దీ రహదారిపై ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. దాతలు ఇచ్చిన దాదాపు 10వేల పుస్తకాలను రాత్రివేళ రహదారులపై పర్చారు.
‘లిటరేచర్ వర్సెస్ ట్రాఫిక్’ పేరుతో రహదారుల్ని పుస్తకాల నదిలా మార్చేశారు. ఇది చూపరుల్ని బాగా ఆకట్టుకుంది. పుస్తక పఠనం ఇష్టమైనవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చని, ఫొటోలు తీసుకోవచ్చని, ఇంటికి తీసుకెళ్ళవచ్చుననీ ప్రకటించారు. దీంతో ఆ దారిలో వెళ్తున్న వారు, ఇరుగుపొరుగు వారు తమకు నచ్చిన పుస్తకాలను తీసుకెళ్ళారు. తెల్లవారేసరికి రోడ్డు ఖాళీ అయిపోయింది. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించారు.
పుస్తక పఠనంతో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. మేధస్సు సక్రమంగా పని చేసి ఆలోచనలు నియంత్రించేందుకు పఠనం దోహదం చేస్తుంది. అనవసర ఆలోచనల్ని నియంత్రించి శారీరక ఆరోగ్యం చేకూరుస్తుంది. ఒత్తిడి నుండి విముక్తి చెందాలంటే, రాత్రి పడుకోబోయే ముందు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివడం మంచిది. గాడ నిద్ర పట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఏకాగ్రత చేకూరి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.
ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో తరహ పుస్తకం అవసరం. ప్రారంభంలో బోమ్మలు, కథల పుస్తకాలతో మొదలుపెట్టి ప్రపంచ నాగరికతలు, వింతలు, శాస్త్రవేత్తలు, పరికరాలు, సాహసగాథలు ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క కొత్త విషయాన్ని తెలియజేసే పుస్తకాలు చదివించాలి. అలా చదివించి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి.
ఇంటర్నెట్ పుణ్యమా అని కనీసం వార్తాపత్రిక కూడా కొనుక్కోకుండా ఇంటర్నెట్లోనే అన్నీ ఫ్రీగా చదివేస్తున్నాం. కానీ దానితో పాటే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అదేపనిగా కూర్చుని ఇంటర్నెట్లో చదవడం వల్ల కళ్ళు పాడవడం, ఊబకాయం వంటి సమస్యలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పైగా కంప్యూటర్పై చదవడం వల్ల ఊహాశక్తికి తావు ఉండదు, అదే పుస్తక పఠనం ద్వారా చిత్రాలను మనసులో ఊహించుకోగలం తద్వారా ఊహాశక్తి పెంపొందు తుందని పరిశోధకులు చెబుతున్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్