తెలుగు కథా సార్వభౌముడు-శ్రీపాద
- April 23, 2025
గురజాడ, వీరేశలింగం తర్వాత తెలుగు కథను భుజానికెత్తుకున్న వ్యక్తిగా శ్రీపాదను విమర్శకులు వర్ణిస్తారు. తెలుగు కథలను చదవాలంటే వాటిలో తప్పనిసరిగా శ్రీపాద వారి కథలు కూడా ఉండాలని సాహితీవేత్తలు చెబుతారు.ఆయన రచనలు చదివినవారు... ఇలాంటి మాటలతో ఏకీభవించి తీరాల్సిందే!
'ముందు గ్రంథాలు పట్టు, తపస్సు చెయ్యి, ఆ తరువాత కలం పట్టు' అరవై డెబ్బై ఏళ్ళ క్రితం కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాహితీ రంగంలో కృషి చేసే యువకులకు చేసిన హెచ్చరిక ఇది గ్రంథాలు చదివితే పదసంపద పెరుగుతుంది. గ్రంథాలు బుద్ధికి మారాకు పట్టిస్తాయి. జ్ఞానాన్ని గురించి ఆవేదన కలిగిస్తాయి అన్నది శ్రీపాదవారి విశ్వాసం. లోకుల సంభాషణలు వింటూ ఉండడమూ, గ్రంథాలు చదువుతూ వుండడమూ, ఎడతెగకుండా రచనలు సాగిస్తూ వుండడమూ-ఈ విధంగా భాషాజ్ఞానం సంపాదించాలి కవి అంటారాయన.
శ్రీపాద దృష్టిలో రచన అనేది ఒక తపస్సు. కవి సమాధిలో కూచున్నాడా సరియైన తాదాత్మ్యం సిద్ధించిందా ఇక అతనికి భోగాల మీదికి దృష్టి పోదు. కష్టాలు కనబడవు. రచనలో మునిగిన కవి మానసిక స్థితి అలా ఉంటుంది అంటారాయన. కవి హృదయం అతి సున్నితమట. సాధారణ ప్రజలు చూడలేని ఆనందం అతడు చూడగలడట. ఆ ఆనందం పరులు కూడా పొందాలని అతడు కావ్యం రచిస్తాడని శాస్త్రిగారు కావ్య సృష్టిలోని పరమార్థాన్ని చెప్పారు. నేడు శ్రీపాద వారి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం...
సుబ్రహ్మణ్యశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సమీపంలోని పొలమూరులో 1891 ఏప్రిల్ 23వ తేదీన జన్మించారు. స్వగ్రామం మహేంద్రవాడ. వారిది వైదిక నిష్టాగరిష్టమైన కుటుంబం. ఎన్నో నియమాలు. సంస్కృతమే తప్ప తెలుగు గ్రంథాలు ముట్టడానికే వీలులేదు ఆ కుటుంబంలో. చొక్కా తొడుక్కోవాలని ఉబలాటం. పనికిరాదంటారు పెద్దలు. దీంతో కుటుంబ సంప్రదాయాలపై తిరుగుబాటు చేశారు శాస్త్రిగారు. ఈ లక్షణమే వారి రచనల్లో దర్శనమిస్తుంది. వరకట్నం, అస్పృస్యత వంటి దురాచారాలపై దాడి కనిపిస్తుంది. మహిళలపై సానుభూతి చోటుచేసుకుంటుంది.
నా తెలుగుపై నాకు నిషేధం ఏమిటీ? అనుకుని ఓం ప్రథమంగా నన్నయ భారతాన్ని తెరిచారు. తెలుగు గడ్డపైనే తెలుక్కి అన్యాయం జరుగుతోందని చిన్నప్పుడే ఆయన తెలుసుకోగలిగారు. ఇదే తెలుగు సాహిత్యానికి ఆయన్ని అంకితం చేసింది. తెలుగుభాషకూ, తెలుగు జాతికీ జరుగుతున అపకారాన్ని శాస్త్రి ఎదిరించారు. తమ ప్రబుద్ధాంధ్ర పత్రికద్వారా పోరాటాలే జరిపారు. గ్రాంథికం నుంచి వ్యావహారికభాషకు మళ్ళి దానికి అండగా నిలిచారు. వ్యావహారికభాష తియ్యదనాన్ని రుచి చూశారు. రచనల ద్వారా రుచి చూపించారు.
"తెలుగు భాష గొప్పదనాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి: “ నా తెనుగు భాష శాస్త్రీయం, తాటాబూటం కాదు. నా తెనుగుభాష యుగయుగాలుగా ప్రవాహినిగా వుండినదిగాని, యివాళ ఆ భాషలోంచి వొక మాటా యీ భాషలోంచి ఒక మాటా యెరువు తెచ్చుకుని భారతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు. నా తెనుగు సరప్వతికే తేనె చినుకు లందించిందిగాని నిరుచప్పనిది కాదు. నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలిగిందిగాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందికాదు. అక్రమ దోహదాలతో పోషించ బడవలసిందీకాదు”.
శ్రీపాద వారు కధలు, కథానికల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు. పైగా భాషకు గౌరవం తీసుకువచ్చారు. అందుకే ఆయనను ఆధునిక కథా చక్రవర్తిగా పిలుస్తారు. ఆయన కథల్లో గిడుగు, గురజాడలను దర్శించుకోవచ్చు.దాదాపు 75 కథలు రాసారు.వాటిలో వడ్లగింజ, గులాబీ అత్తరు, అరికాళ్ల క్రింద మంటలు, ఇలాంటి తవ్వాయి వస్తే...ఆణిముత్యాలు. వడ్లగింజ కథ శ్రీపాద వారికి ఎంతో పేరు తెచ్చింది.
శ్రీపాద వారి 75 కథల్లో ఎక్కువభాగం అప్పటి అగ్రవర్ణాల అంతర్మధనంగానే కనిపిస్తాయి. శ్రీపాద ఒక వర్గానికే వ్యతిరేకంగా తన కలాన్ని ఎక్కుపెట్టినట్లు కనిపించినప్పటికీ...ఆయన ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులు అవే కావడం చేత, అవే ఇతివృత్తాలను కథాంశంగా తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు.పైగా ఆయన బలం కూడా అదేనని తోస్తుంది. తను విన్న మాండలికాలు, పడికట్టు పదాలు, వాక్య నిర్మాణాలను యధాతథంగా సంభాషణల్లోకి చొప్పించడంతో సదరు కథలు సహజంగా తోస్తాయి. అందుకే తెలుగు భాష మీద పట్టు సాధించాలన్నా, ఒకప్పటి తెలుగు సమాజం మీద అవగాహన ఏర్పరుచుకోవాలన్నా తప్పకుండా శ్రీపాద కథలని చదవమని పెద్దలు చెబుతుంటారు.
శ్రీపాద కథలకి ఒక పరిమితి అంటూ కనిపించదు.ఇలా రాయాలని ఆయన మడిగట్టుకున్నట్లు తోచదు. ఒకసారి రాయడం అంటూ మొదలుపెడితే అది పది పేజీలలో ముగిసిపోవచ్చు.60 పేజీలని దాటిపోవచ్చు.తను చెప్పదల్చుకున్న విషయాన్నంతా కాగితం మీద ఆవిష్కరించడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది.అలాగని ఆయన కథలలో వర్ణనలు, కల్పనలూ కనిపించవు. సాదాసీదా సంభాషణలే కథని నడిపిస్తాయి.ఒకోసారైతే ఎలాంటి వివరణా లేకుండా పూర్తిగా సంభాషణలతోనే కథ నడుస్తుంది. అందుకు ‘బ్రాహ్మణాగ్రహారం’ అనే కథే గొప్ప ఉదాహరణ. పాఠకుడు ఇందులో కథని కేవలం సంభాషణల ద్వారానే వెతుక్కోవలసి ఉంటుంది.
తెలుగు మాగాణి నాలుగు చెరగులా తిరిగి అక్కడక్కడి పలుకుబళ్లు ఒంట బట్టించుకున్నాక తనకు ఐదు ప్రాణాలూ సంక్రమించినట్టు అయిందంటారు శ్రీపాద వారు. తన ప్రాంతపు పలుకుబడిలో యెంత శక్తి వుందో అక్కడక్కడి పలుకుబళ్ళలోనూ అంతంత జీవశక్తీ వుంది అంటారు ఆయన.ఒక్కొ సీమలో ఒక్కొక్క జీవకణం ఉందట. అన్నీ ఒకచోటికి చేర్చగల, అన్నీ ఒక్క తెలుగు రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకురావాలి అని అసలు విషయం వెల్లడించారు. అవునుకదా, నిజానికి ఇప్పుడదే జరగాలి.
మాతృభాషపట్ల చిన్నచూపు పనికిరాదంటూ తల్లిభాష విడిచి ఇతర భాష నేర్చుకునేవాడూ తల్లిభాషలో కాక ఇతర భాషల్లో మాట్లాడేవాడూ తల్లిభాషలోకాక ఇతరభాషలో ఆనందించేవాడూ-తల్లి లేని బిడ్డ అంటారు. శ్రీపాదవారి దృష్టిలో తెలుగుదేశమే దేశం. తెలుగుభాషే భాష. తెలుగు మనుషులే మనుషులు. తెలుగు వేషమే వేషం. ఇది కొంచెం తీవ్రంగా తోచినా కచ్చితంగా వాస్తవం. విదేశీయులు సైతం అంగీకరించిన పరమ సత్యం. ఇప్పటి మన దయనీయమైన పరిస్థితికి నేను ఆంధ్రుణ్ణి అనే భావన బొత్తిగా లేకపోవడమే కారణం. కాబట్టి అలా భావించడం చాలా అవసరం.
'భారత దేశం అంతా వీరవిహారంగా చేసుకుని, మహాసామ్రాజ్యాలు నిర్మించి, అనేక ప్రాంతాలవారిని పరిపాలించి, - అయ్యో! నేడు భృత్యునిగా, అనుచరునిగా, మట్టి తలకాయవానిగా యాసడింపబడుతున్నానే' అనే అవేశం కలిగించాలి. అంతేకాదు 'నే నాంధ్రుణ్ణి. నా పూర్వుల రక్తమే నన్ను నడిపిస్తోంది. భరతవర్షానికి నేను ప్రవర్తకుణ్ణి. ప్రపంచానికి నేను ఆదర్శ పురుషుణ్ణి అని చెప్పుకోగలగడమే పరమావధి' అని కూడా శ్రీ పాదవారు ఉద్భోదించారు.
'తెలుగులో విజ్ఞానం కలిగించే కావాఞ్మయం నిర్మించాలి. నోరు విప్పితే ఉద్రేకం పుట్టించే ఉపన్యాసం చెయ్యాలి. నడుంకట్టితే ఫలితం ఝిచ్చే కార్యక్రమం నెరవేర్చాలి. ఇది ప్రయోజనకరమైన సందేశం? ఏ జాతి ఎదటా ఏ సందార్భంలోనూ ఎందుకున్నూ నా తెలుగుజాతి తీసిపోదు. అంచేత ప్రపంచానికిది ఉద్ఘాటించడానికి నా సేవలు జాతికే మీదు కట్టుకోవాలి నేను అని శ్రీపాదవారు ప్రతిజ్ఞలాంటిదే చేశారు. దానికి కట్టుబడి కృషి చేశారు.
కథా రచయితగా ప్రఖ్యాతి పొందిన సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు సాహిత్యంలో నవల, నాటక, కథ, కవిత, చరిత్రలు, పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు- ఇలా అన్ని ప్రక్రియలూ చేపట్టి ఓహో అనిపించుకున్నారు. వ్యాఖ్యానాలు రాశారు. అవధానాలు చేశారు. ప్రబుద్ధాంధ్ర అనే పత్రిక స్థాపించి సంపాదకత్వం వహించారు. గంధర్వ ఫార్మసీ స్థాపించి ఆయుర్వేదం మందులు తయారు చేశారు. కళాభివృద్ధినీ పరిషత్ ఏర్పాటు చేసి సాహితీ సభలూ, సన్మానాలూ నిర్వహించారు. నాటకాలు ఆడారు.
శ్రీపాద సంప్రదాయవాది కాదు. అలాగని అప్పటి పరిస్థితుల మీద ఘాటైన వ్యాఖ్యానాలూ చేయలేదు. అప్పటి సమాజాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాఠకులకు చూపించే ప్రయత్నం చేశారు. ఆయనకు గాంధి అన్నా, ఖద్దరు అన్నా, హిందీ అన్నా ఇష్టం ఉండేది కాదని చెబుతుంటారు. ‘ఇలాంటి తువ్వాయి వస్తే’ కథ చదివితే అది నిజమే అనిపిస్తుంది. అందులో గాంధి, కాంగ్రెస్సు, హరిజనోద్ధరణ సంఘాలు, జాతీయ భాషగా హిందీని చేయడం, ఖద్దరు గురించి ప్రచారం... వంటి అంశాల మీద తన అసంతృప్తిని వెళ్లగక్కుతారు రచయిత.
సంగీతంపై అభిమానంతో వయోలిన్ నేర్చుకున్నారు. నిజాయితీ, నియమబద్ధతా, నిష్కర్ష ఆయనకు సహజ గుణాలు. దేనిలోనూ రాజీ ఉండదు. 'అనుభవాలూ జ్ఞాపకాలూను' పేరుతో రాసినా వారి ఆత్మకథ ఎన్నో ప్రశంసలు అందుకుంది. అన్నింటినీ మించి ఆయనకు తెలుగుజాతి అన్నా అభిమానం ఎక్కువ. ఏమాత్రం కల్తీలేని అసలు సిసలైన తెలుగు రచయిత ఆయన.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు 1961 ఫిబ్రవరి 25 మరణించారు. ఆంధ్రజాతి అభ్యుదయం కోసం తపించే ఒక పెద్ద అండ కరువైంది. వారికి నిజమైన నివాళులు అర్పించుకోగలగడం మన విధి. శ్రీపాద వారు రాసిన కథలు ప్రతి ఒక్కరూ చదివితీరాల్సిన స్థాయిలో నిలుస్తాయి. ఆ కథలు ఉన్నంతవరకూ శ్రీపాద తెలుగువారికి అమరుడే!
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్