ఆగస్టు 1 నుంచి కొత్త UPI రూల్స్..

- July 10, 2025 , by Maagulf
ఆగస్టు 1 నుంచి కొత్త UPI రూల్స్..

న్యూ ఢిల్లీ: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. అన్ని లావాదేవీలు ఎక్కువగా యూపీఐతోనే చేస్తున్నారా? యూపీఐ పేమెంట్లకు సంబంధించి ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ (UPI Rules) రాబోతున్నాయి. ప్రతిరోజూ UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సౌకర్యాన్ని ఉపయోగిస్తుంటే.. ఇది మీకోసమే..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ పేమెంట్లకు సంబంధించిన కొత్త నియమాలను అమల్లోకి తీసుకురానుంది. యూపీఐ సిస్టమ్ గతంలో కన్నా వేగంగా సురక్షితంగా సర్వీసులను అందించడమే లక్ష్యంగా NPCI ఈ కొత్త నిబంధనలను తీసుకొస్తోంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై యూపీఐ యూజర్లకు బ్యాలెన్స్ చెక్ చేయలన్నా లేదా ఆటోపే, రోజువారీ ట్రాన్సాక్షన్లపై పరిమితులు ఉంటాయి.

ఆగస్టు 1 నుంచి కొత్త UPI రూల్స్:
ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. యూపీఐ సర్వీసులను వేగవంతం చేయడమే కాకుండా సిస్టమ్‌పై ప్రెజర్ తగ్గించడానికి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఈ మార్పులను చేసింది. ఇప్పుడు, మీరు యూపీఐ యాప్‌లలో రోజుకు 50 సార్లు మాత్రమే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయవచ్చు. సిస్టమ్‌పై అదనపు భారాన్ని నివారించేందుకు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొస్తోంది.

మీ మొబైల్ నంబర్‌కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో కూడా మీరు ఒక రోజులో 25 సార్లు మాత్రమే చూడవచ్చు.Netflix, SIP మొదలైన ఆటో డెబిట్ పేమెంట్లు బిజీగా లేని సమయాల్లో మాత్రమే జరుగుతాయి.

ఉదయం 10 గంటల ముందు ఒకసారి, మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, రాత్రి 9:30 గంటల తర్వాత ఈ ఆటో పేమెంట్లు పూర్తి అవుతాయి. అలాగే, మీ పేమెంట్ ఆగిపోతే.. ఆ స్టేటస్ కేవలం 3 సార్లు మాత్రమే చెక్ చేయవచ్చు. ప్రతి పేమెంట్ స్టేటస్ చెక్ మధ్య 90 సెకన్ల గ్యాప్ ఉంటుంది.

ఈ కొత్త రూల్స్ ఎందుకంటే?
ప్రతి నెలా 16 బిలియన్లకు పైగా పేమెంట్లకు యూపీఐ వాడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో చాలా మంది యూపీఐ స్లో అయిందని, పేమెంట్లు ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. వినియోగదారులు చాలాసార్లు బ్యాలెన్స్‌ను చెక్ చేయడం లేదా ఫెయిల్ పేమెంట్లను చాలాసార్లు రిఫ్రెష్ చేయడం వల్ల సాంకేతిక సమస్యలు సంభవించాయి.

ఈ విషయంలో NPCI ఇతర మార్పులను కూడా చేసింది. దాంతో జూన్ 2025లో యూపీఐ స్పీడ్ మెరుగుపడింది. ఇప్పుడు, పేమెంట్ రిక్వెస్టులు 15 సెకన్లలో పూర్తవుతాయి. ఫెయిల్ పేమెంట్ చెకింగ్స్ 10 సెకన్లలో పూర్తవుతాయి. జూన్ 30 నుంచి మీరు డబ్బు పంపుతున్న వ్యక్తి పేరును కూడా చూడవచ్చు. తద్వారా అనేక మోసాలను నివారించవచ్చు.

అంతేకాదు.. డిసెంబర్ 2024లో ఛార్జ్‌బ్యాక్‌ల కోసం ఒక కొత్త రూల్ చేర్చింది. ఇప్పుడు, ఒక వినియోగదారు 30 రోజుల్లో 10 సార్లు మాత్రమే ఛార్జ్‌బ్యాక్ అడగగలరు. ఒకే వ్యక్తి లేదా కంపెనీ నుంచి 5 సార్లు మాత్రమే అడగగలరు. తద్వారా యూపీఐ అందరికీ మెరుగ్గా, వేగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com