తెలంగాణలో దసరా సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన..

- September 08, 2025 , by Maagulf
తెలంగాణలో దసరా సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన..

హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న దసరా సెలవుల షెడ్యూల్‌ను వచ్చేసింది.

పాఠశాలలకు సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 3 వరకు మొత్తం 13 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. తిరిగి అక్టోబర్‌ 4న బడులు ప్రారంభం కానున్నాయి. 

ఇక జూనియర్‌ కళాశాలలకు మాత్రం వేరే షెడ్యూల్‌ను ప్రకటించారు. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు దసరా సెలవులు ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మొత్తం ఎనిమిది రోజులు హాలీడేస్‌ వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.

తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాలకు వెళ్లడం, పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం, బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం వంటివి నిర్వహిస్తారు.

ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా రవాణా శాఖ ప్రత్యేక బస్సులు నడపనుంది. బస్సులు, రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేసుకోండి.

బోర్డ్ ఎగ్జామ్స్‌, ఎంసెట్ వంటి పరీక్షలు రాసే విద్యార్థులు సెలవుల్లో పూర్తిగా చదువును వదిలేయకుండా కొంత సమయాన్ని పాఠ్యాంశాల పునశ్చరణకు కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలవుల అనంతరం స్కూల్‌ విద్యార్థులు అక్టోబర్‌ 24 నుంచి 31 వరకు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) – 1 పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com