వైమానిక దాడుల్లో 6,500 మంది పౌరులు మృతి చెందటమే ప్రధాన కారణం: పెంటగాన్‌

- August 20, 2016 , by Maagulf
వైమానిక దాడుల్లో 6,500 మంది పౌరులు మృతి చెందటమే ప్రధాన కారణం: పెంటగాన్‌

పశ్చిమాసియా అరబ్బు దేశం యెమెన్‌ నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపించినట్టు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. యెమెన్‌లో చెలరేగిన అంతర్యు ద్ధాన్ని అణిచివేసేందుకు సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్నది. యెమెన్‌లో భద్రతా బలగాలను మోహరించి ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నది. సౌదీ అరేబియా నిర్వహించే వైమానిక దాడులకు అమెరికా సహకరిస్తున్నది. ఈ మేరకు అమెరికా బలగాలు యెమెన్‌లో 17 నెలల పాటు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించాయి. అయితే, అమెరికా, సౌదీ బలగాలు నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో 6,500 మంది పౌరులు మృతి చెందారు.ఈ నేపథ్యంలో యెమెన్‌లో మోహరించిన తమ బలగాలనుఉపసంహరించుకున్నట్టు పెంటాగన్‌ ప్రకటించింది. అంతేగాకుండా, నావికా సైనికులను కూడా వెనక్కి పిలిపించుకున్నట్టు నావికాదళం అధికార ప్రతినిధి బహ్రాయిన్‌ తెలిపారు. గతంలో 45 మంది జేసీపీసీ (జాయింట్‌ కంబైండ్‌ ప్లానింగ్‌ సెల్‌) సభ్యులు ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొనగా, ప్రస్తుతం ఐదుగురు మాత్రమే యెమెన్‌లో ఉన్నారని చెప్పారు. జేసీపీసీ సభ్యులు అమెరికా సైనికులతో పాటు రియాద్‌ నిఘా వ్యవస్థతో కలిసి పనిచేసేవారు. భద్రతా ప్రమాణాల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించేవారు. బలగాల ఉపసంహరణకు ప్రధాన కారణాలు అమెరికా, సౌదీ భద్రతా బలగాలు నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో వేలాది మంది మృతి చెందారు. పౌర మరణాల పట్ల సౌదీలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ దేశ పౌరులు ప్రభుత్వాన్ని విమర్శించారు. యెమెన్‌లో సంభవించిన పౌర మరణాలకు అమెరికా జరిపిన వైమానిక దాడులే ప్రధాన కారణమని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించారు అక్కడి అధికారులు. అంతేగాకుండా, అమెరికా బలగాలంటే యెమెన్‌ పౌరుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో, బలగాలను ఉపసంహరించు కోవాలని నిర్ణయించుకున్నది అమెరికా. పౌర మరణాల సంఖ్య పెరిగిన కారణంగా ప్రత్యేక ఆపరేషన్‌ నుంచి తప్పుకున్నట్టు ఆదేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా, సౌదీ నిర్ధేశం మేరకు యెమెన్‌లో వైమానిక దాడులు నిర్వహించినట్టు పెంటాగన్‌ అధికార ప్రతినిధి ఆడమ్‌ స్టంప్‌ చెప్పారు. ఉద్దేశపూర్వకంగా తామెన్నడూ దాడులు నిర్వహించలేదన్నారు. గతంలో సౌదీ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, అమెరికా బలగాల ఉపసంహరణ జరిగిన తర్వాత సౌదీ తాజాగా ఓ ప్రకటన చేసింది. అమెరికా బలగాల సాయంతో యెమెన్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించగలిగామని ఆ దేశ అధికార ప్రతినిధి బ్రిగదీర్‌ జనరల్‌ అహ్మద్‌ అల్‌ అసేరీ చెప్పారు. అమెరికా బలగాలు యెమెన్‌ను వీడినప్పటికీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని ఉద్ఘాటించారు.సౌదీకి అమెరికా సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయని ఓ అమెరికన్‌ అధికారి తెలిపారు. యెమెన్‌లో బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ అమెరికా సైనిక సహకారం ఉంటోందని చెప్పారు. అమెరికా వైమానిక దాడులతో దద్దరిల్లిన యెమెన్‌ అమెరికా బలగాలు జరిపిన వైమానిక దాడులతో యెమెన్‌ దద్దరిల్లింది. సాధారణ పౌరులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్చంధ సంస్థలు కూడా అక్కడ సేవలందించేందుకు వెనక్కి తగ్గాయి. గత రెండు రోజుల కిందట ఎమ్‌ఎస్‌ఎఫ్‌ (మెడిసిన్స్‌ సాన్స్‌ ఫ్రంటీర్స్‌) ఫౌండేషన్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ యెమెన్‌లోని ఆస్పత్రుల్లో స్వచ్చంధగా సేవలందిస్తున్నది. పౌర యుద్ధంలో గాయపడ్డ వారికి వైద్య సేవలు, ఆహారం అందజేస్తున్నది. కాగా, అమెరికా బలగాలు ఆస్పత్రులపై కూడా వైమానిక దాడులు జరుపుతుండటంతో అక్కడ వైద్య సేవలందుకునే రోగులు కూడా మృతి చెందుతున్నారు. అమెరికా చర్యల పట్ల ఎమ్‌ఎస్‌ఎఫ్‌ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాతో పాటు సౌదీ బలగాలు కూడా అంతర్జాతీయ మానవ హక్కులను ఉల్లంఘించాయని ఎమ్‌ ఎస్‌ఎఫ్‌ పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com