ఈ రోజు ఉదయం యాకూబ్ ను ఉరి తీశారు..
- July 29, 2015
మరణశిక్ష నుండి తప్పించుకోవాలని చూసిన 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ పోరాటం విఫలమైంది. నాగ్ పూర్ జైలులో గురువారం ఉదయం 6.30గంటలకు ఉరి తీశారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించారు. అనంతరం 14 రోజుల పాటు శిక్షను వాయిదా వేయాలని యాకూబ్ మరోసారి సుప్రీంను ఆశ్రయించాడు. దీనితో ధర్మాసనం ఈ పిటిషన్ పై గురువారం తెల్లవారుజాము వరకు వాదనలు కొనసాగాయి. యాకూబ్ తరపున ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. తక్కువ సమయంలో క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ఎలా తిరస్కరించారని ప్రశ్నించారు. ఈ వాదనను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు. మెమన్ పిటిషన్ న్యాయవ్యవస్థను కించపరిచేదిగా ఉందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు యాకూబ్ పిటిషన్ ను తిరస్కరించింది. దీనితో నేటి ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నాగ్ పూర్ జైలులో మెమన్ ను ఉరి తీశారు. అతని మృతదేహాన్ని ముంబైకు తరలించనున్నట్లు తెలుస్తోంది. 1993లో.. 1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు.. ఈ కేసులో టైగర్ మెమన్ (యాకూబ్ సోదరుడు), దావూద్ ఇబ్రహీం పేలుళ్లలో ప్రధాన సూత్రధారులు. చార్టర్డ్ అకౌంట్ అయిన మెమన్ స్వయంగా ముంబై పేలుళ్ల కుట్రలో పాలు పంచుకున్నాడని అభియోగాలు రుజువయ్యాయి. దీంతో 2007లో ముంబైలోని టాడా కోర్టు మెమన్తో సహా 11 మందికి ఉరిశిక్ష విధించింది. యాకుబ్ మెమన్ ఉరిశిక్షపై రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నిరాకరించారు. 257 మంది మృతి ..... . 1993 మార్చి 12: ముంబైలోని 13 ప్రాంతాల్లో వరుస పేలుళ్లు.. 257 మంది మృతి.. 713 మందికి గాయాలు. 1993 నవంబర్ 4: 189 మంది నిందితులపై 10 వేల పేజీల చార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ. 1995 ఏప్రిల్ 10: 26 మంది నిందితులను విడుదల చేసిన టాడా కోర్టు. 2001 జులై 18: 684 మంది సాక్షుల స్టేట్మెంట్ల రికార్డు పూర్తి. 2003 సెప్టెంబర్: పూర్తైన విచారణ.. రిజర్వ్ లో తీర్పు. 2006 సెప్టెంబర్ 12: తీర్పును వెల్లడించిన ముంబైలోని టాడా కోర్టు. 12 మందికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ ఖైదు ఖరారు. 2013 మార్చి 21: యాకూబ్ మెమన్, టైగర్ మెమన్ల ఉరిశిక్షలను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు. పది మందికి శిక్షలను యావజ్జీవంగా మార్పు. 2014 మే: యాకుబ్ క్షమాభిక్ష పిటిషన్ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్. 2014 జూన్ 2: క్షమాభిక్ష పిటిషన్లను ఓపెన్ కోర్టులోనే విచారణ జరపాలన్న నిబంధన మేరకు, ఉరిశిక్షను నిలిపివేసిన అత్యున్నత న్యాయస్ధానం. 2015 ఏప్రిల్ 9: మరణశిక్షపై యాకూబ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. 2015 జులై 21: క్యూరిటివ్ పిటిషన్ తొసిపుచ్చిన సుప్రీం కోర్టు. 2015 జులై 29 : మెమన్ దాఖలు చేసిన మరో పిటిషన్ సుప్రీం తోసిపుచ్చింది. 2015 జులై 29 : క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతికి మెమన్ విజ్ఞప్తి..తిరస్కరించిన రాష్ట్రపతి. 2015 జులై 29: రాత్రి సుప్రీంలో మరోసారి మెమన్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. 2015 జులై 29 : బుధవారం అర్ధరాత్రి వరకు వాదనలు జరిగాయి. 2015 జులై 29 : చివరకు దీనిని సుప్రీం తిరస్కరించింది. 2015 జులై 30 : గురువారం ఉదయం యాకూబ్ ను ఉరి తీశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









