అక్టోబర్ 3న వెలగపూడిలో సచివాలయం ప్రారంభం...

- September 27, 2016 , by Maagulf
అక్టోబర్ 3న వెలగపూడిలో సచివాలయం ప్రారంభం...

అక్టోబర్ 3న వెలగపూడిలో సచివాలయం ప్రారంభంకానుంది. 3వ తేదీ నుంచి అమరావతి నుంచి పూర్తిస్థాయి పాలన కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖలవారీగా ఆయా భవనాల్లో కేటాయించిన స్థలాన్ని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. జీఏడీ పొలిటికల్ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విజయవాడలో ఉత్తర్వులు జారీ చేశారు. 30వ తేదీలోపే హైదరాబాద్ సెక్రటేరియట్‌లో ఉన్న తమ శాఖలకు సంబంధించిన ఫైళ్ల డిజిటలైజేషన్ పూర్తి చేసుకుని వాటిని వెలగపూడి సెక్రటేరియట్‌కు తరలించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అక్టోబర్ 3 ఉదయం పది గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన అంతా వెలగపూడి సెక్రటేరియట్‌లోని నాలుగు బ్లాక్‌ల నుంచి ప్రారంభంకావాలని శ్రీకాంత్ స్పష్టం చేశారు.అలాగే ఉద్యోగులకు సంబంధించిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 11 విజయదశమి పర్వదినాన బ్లాక్ నెంబర్ 1లోని తన కార్యాలయంలో గృహప్రవేశం చేయబోతున్నారు. 12వ తేదీ నుంచి వెలగపూడి సచివాలయం నుంచి సీఎం తన పరిపాలనను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 5 నాటికి సీఎం కార్యాలయ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి సీఎంవోకు భవనాన్ని అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.సచివాలయానికి హైదరాబాద్ నుంచి తరలివచ్చే మహిళా ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం ఈరోజు గుంటూరులోని ఆచార్యనాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో 30 అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుంది. త్రీబెడ్‌రూం ఫ్లాట్లను ఫర్నీచర్‌తో సహా ఇచ్చేందుకు ఫ్లాట్ ఓనర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంది. ఒక్కో ఫ్లాట్‌లో ఆరుగురు ఉద్యోగినులకు వసతి కల్పించనున్నారు. ఒక్కో త్రీ బెడ్‌రూం ఫ్లాట్‌కు రూ.22వేలు అద్దెగా నిర్ణయించారు. ఈ 30ఫ్లాట్లలో మొత్తం 180 మంది మహిళా ఉద్యోగినులు ఉండే విధంగా వసతి సమకూరుస్తున్నారు. అలాగే మరో పది ఫ్లాట్లను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెయిన్‌ ట్రీ పార్కు ఓనర్లకు సూచించింది. మొత్తం 40 ఫ్లాట్లలో మహిళా ఉద్యోగులు ఉండనున్నారు. వారి కోసం రెయిన్ ట్రీ పార్కు నుంచి సచివాలయం వరకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com