బాంబు పేలుళ్లతో గజగజలాడిన ఇరాక్

- October 21, 2016 , by Maagulf
బాంబు పేలుళ్లతో గజగజలాడిన ఇరాక్

ఇరాక్‌ నగరమైన కిర్కాక్‌లో కుర్దిష్‌ల అదుపులో వున్న ప్రభుత్వ లక్ష్యాలపై ఆత్మాహుతి బాంబర్లు దాడి జరిపి 16మందిని పొట్టనబెట్టుకున్నారు. కాగా మరోవైపు జిహాదీలకు పెట్టని కోటగా వున్న మాసుల్‌ వైపు బలగాలు చొచ్చుకుపోతున్నాయి. ఈ దాడులు జరిపింది ఎవరనేది వెంటనే తెలియరాలేదు. అయితే ఈ దాడులకు కారకులు ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ తీవ్రవాదులేనని భావిస్తున్నారు. ఇరాక్‌లో తమ చిట్టచివరి, ప్రధాన స్థావరమైన మాసుల్‌పై ఎలాగైనా పట్టు నిలుపుకోవాలనే ఆలోచనతో ఐసిస్‌ తీవ్రవాదులే ఈ దాడులకు తెగబడుతున్నారు. కిర్కాక్‌కు వాయవ్యంగా 40కిలోమీటర్ల దూరంలో వున్న దిబిస్‌ పట్టణానికి సమీపంలో ఇరాన్‌ కంపెనీ నిర్మించిన పవర్‌ ఫ్లాంట్‌లోకి ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు చొచ్చుకుపోయారని, 12మంది ఇరాకీ అడ్మినిస్ట్రేటర్లను, ఇంజనీర్లను, నలుగురు ఇరాన్‌ సాంకేతిక నిపుణులను హతమార్చారని డిబిస్‌ నగర మేయర్‌ తెలిపారు. మృతుల సంఖ్యను పోలీసు అధికారి ధృవీకరించారు. వెంటనే భద్రతా బలగాలు స్పందించి జరిపిన ఎదురు దాడుల్లో ఒక ఆత్మాహతి దళ సభ్యుడు చనిపోయాడు. మరో ఇద్దరు ముందు లంగిపోయి తర్వాత వారిని వారే పేల్చుకుని మరణించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే సాయుధ ఆత్మాహుతి బాంబర్ల కమాండో కిర్కాక్‌లోని పలు ప్రాంతాల్లో విరుచుకుపడ్డాడని భద్రతా వర్గాలు తెలిపాయి. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో నగరంలోని ప్రధాన పోలీసు కార్యాలయంపై నలుగురు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారని కుర్దిష్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి చెప్పారు. వారిలో ఒకరిని భద్రతా బలగాలు కాల్చి చంపాయని మిగిలిన ముగ్గురు తమను తాము పేల్చుకున్నారని తెలిపారు. నగరంలోని దక్షణ ప్రాంతంలో అనేక లక్ష్యాలపై కూడా దాడులు జరిగాయని, వారందరూ కూడా ఐఎస్‌ సభ్యులేనని చెప్పారు. ఐదు గంటలైనా కూడా పోరు సాగుతునే వుందని కిర్కాక్‌ అధికారి చెప్పారు. దాంతో నగరమంతటా పూర్తి కర్ఫ్యూ విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com