ఢిల్లీలో కాలుష్యం కేజ్రీవాల్ సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది..

- November 06, 2016 , by Maagulf
ఢిల్లీలో కాలుష్యం కేజ్రీవాల్ సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది..

ఢిల్లీలో కాలుష్యం కేజ్రీవాల్ సర్కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఇది తీవ్రం కావడంతో వెంటనే నివారణ చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. కాలుష్యం పెరగకుండా ఢిల్లీలో కొన్ని ఆంక్షలు విధించింది. సరి-బేసి నంబర్ వాహనాల విధానాన్ని మరోసారి తెరపైకి తీసుకొస్తోంది.అంతకంతకూ ప్రమాదకరంగా మారుతున్న కాలుష్యంపై ఢిల్లీ సర్కారు యుద్ధప్రాతిపదికన చర్యలకు సిద్ధమైంది. దీనికోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు  మరో మూడు రోజుల పాటు ఢిల్లీలో స్కూళ్లు మూసేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వాయు కాలుష్యాన్ని నివారించే చర్యలపై తన నివాసంలో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి ఢిల్లీలో భవన నిర్మాణాలు, కూల్చివేతలపై 5 రోజుల నిషేధం విధించారు. ఆస్పత్రులు, అత్యవసర ప్రాంతాల్లో తప్ప వేరే ఎక్కడా మరో పది రోజుల పాటు డీజిల్ జనరేటర్ సెట్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. చెత్తను, తగలబెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 10 నుంచి ఢిల్లీ రోడ్లపై వాక్యూమ్ క్లీనింగ్ చేపట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి రోడ్లు తడిపే కార్యక్రమం ప్రారంభించనున్నారు. కాలుష్య నియంత్రణ కోసం గతంలో అమలు చేసిన సరి-బేసి విధానాన్ని మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు. కృత్రిమ వర్షాల కురిపించే అవకాశాలపైనా చర్చించిన సీఎం.. దానికి కేంద్ర సహకారం అవసరమని భావించారు. నగర ప్రజలు వీలైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మరోవైపు ఢిల్లీ గత 17 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కాలుష్యం కోరల్లో చిక్కుకోవడంతో..  నగరంలో మాస్కుల అమ్మకాలు జోరుగా సాగాయి. అందరూ మాస్కులు కోసం క్యూ కట్టడంతో ఢిల్లీతోపాటూ, సమీప ప్రాంతాల్లో కూడా వీటి స్టాక్ అయిపోయింది. ఆన్‌ లైన్లో కూడా స్టాక్ లేకుండా పోయింది. దీపావళి తర్వాత ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ చూపడంతో మాస్కుల అమ్మకాలు ఒక్కసారిగా  పెరిగాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com