'ఆదియోగి' ఆవిష్కరణోత్సవం లో మోడీ

- February 24, 2017 , by Maagulf
'ఆదియోగి' ఆవిష్కరణోత్సవం లో మోడీ

యోగ ఆరోగ్యానికి పాస్‌పోర్టు వంటిదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తమిళనాడు, కేరళ సరిహద్దులో కోయంబత్తూరు సమీపంలో ఉన్న ఈశా యోగా కేంద్రంలో ఏర్పాటు చేసిన 112 అడుగుల ఎత్తైన ‘ఆదియోగి’ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ వైవిధ్యమన్నది మనలో ఏకత్వానికి ప్రతీక. జీవం ఎక్కడ ఉందో.. శివం అక్కడ ఉంది. జీవం నుంచి శివం చేరే యాత్ర యోగం. నేను నుంచి మనం వరకు సాగే యాత్ర యోగ. శివపార్వతుల కలయిక అంటే సముద్రాలు, హిమాలయాల సంగమం. భారత్‌.. యోగాను ప్రపంచానికి బహుమతిగా అందించింది. దేశంలో అనేకమంది సాంఘిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు.
శాంతి సాధనలో యోగ గొప్ప మార్పులు తీసుకురాగలదు. యోగను ప్రపంచమంతా ముక్తకంఠంతో స్వాగతించింది. నారీ అంటే నారాయణి.. ఇది స్త్రీ మూర్తులకు మనమిచ్చిన గౌరవం. భారతదేశం ఒక గొప్ప వైవిధ్య సంస్కృతులున్న జీవధార. వైవిధ్యమన్నది భారతదేశపు ఆత్మ, జీవనగమనం. సత్యం ఒక్కటే రూపాలు అనేకం.. ఇది భారతీయ తత్వం.’’ అని వివరించారు. మనకు ఎన్నో పండుగలు ఉన్నాయి... కానీ మహాశివరాత్రి ఎంతో ముఖ్యమైన పండుగ. ఎంతో మంది దేవుళ్లు ఉన్నప్పటికీ మహాశివుడు గొప్ప, ఎన్నో మంత్రాలు ఉన్న మహా మృత్యుంజయ మంత్రం గొప్పది అని మోదీ వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం రోజు ఈశా యోగ కేంద్రంలో గడపటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతకు ముందు సద్గురు జగ్గి వాసుదేవ్‌తో కలిసి ప్రధాని మోదీ ఆశ్రమంలో కలియతిరిగారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. యోగశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చసేందుకు రూపొందించిన ఆది యోగి పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. వచ్చే మహాశివరాత్రి నాటికి 10 కోట్ల మందికి యోగ శిక్షణ ఇవ్వనున్నట్లు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి గవర్నర్లు విద్యాసాగర్‌రావు, కిరణ్‌బేది, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com