తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది

- February 26, 2017 , by Maagulf
తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది

చెన్నై: తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుచెందూరులో నమప్పాడు సముద్రతీరంలో అలల ధాటికి పడవ మునిగి 9 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో పడవలో 20 నుంచి 30 మంది ఉన్నారు.
పర్యాటకులతో వెళ్తున్న పడవ సముద్రంలో బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరు గల్లంతైనట్టు భావిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్‌ సముద్రతీరంలోని ప్రసిద్ధ ఆలయానికి ఆదివారం కొందరు పర్యాటకులు వచ్చారు. వారు పడవ షికారుకు వెళ్లేందుకు ఉత్సుకత చూపించారు. ఓ జాలరి వారిని సముద్రంలో కొంత దూరం తీసుకెళ్తానన్నాడు.
తన పడవలో సుమారు 20 మందిని ఎక్కించుకుని వెళ్లాడు.
పడవ కొద్ది దూరం వెళ్లగానే మణప్పాడు ప్రాంతం వద్ద సముద్రంలో బోల్తా కొట్టింది. దీనిని గమనించిన తీరంలోని కొందరు జాలర్లు తమ పడవల్లో అక్కడికి వెళ్లారు.
మొత్తం 11 మందిని తీరానికి చేర్చగా, వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వారిలో నలుగురు మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలిలో కొందరు మత్స్యకారులు గాలింపు చర్యలు కొనసాగించారు.
తర్వాత మరో అయిదుగురిని తీరానికి చేర్చారు. ఆస్పత్రులకు తరలించగా అప్పటికే ఆ ఐదుగురు మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పడవలో ప్రయాణించినవారి సంఖ్యలో స్పష్టత లేకపోవడంతో ఎవరైనా గల్లంతై ఉండొచ్చనే అనుమానంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. మృతులు తిరుచ్చి, తిరుచెందూర్‌ సమీపంలోని పడుకప్పం ప్రాంతాలకు చెందినవారు.
మణప్పాడు ప్రాంతానికి తూత్తుకుడి కలెక్టరు రవికుమార్‌, ఎస్పీ అశ్విన్‌ కోట్నీస్‌ తదితరులు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. వీరిలో ఏడుగురి ఆచూకీ లభ్యమైంది. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. అలల ధాటికి పడవ ఒక్కసారిగా తిరగబడింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పడవలో 20 మంది ఉన్నారా, 30 మంది ప్రయాణిస్తున్నారా స్పష్టత లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com