సౌదీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

- September 25, 2015 , by Maagulf
సౌదీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులను బలిగొన్న తొక్కిసలాట సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యాత్రలో పాల్గొంటున్న లక్షలాది మందిని నియంత్రించడానికి రూపొందించిన నిబంధనలను కొంతమంది యాత్రికులు పాటించలేదని, అందువల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని సౌదీ అరేబియా ప్రభుత్వం శుక్రవారం పేర్కొంది. మరోవైపు, సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కుమారుడే ఈ దుర్ఘటనకు కారణమని ఒక పత్రిక ప్రచురించిన వార్తాకథనం తెలిపింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కాన్వాయ్ వల్లనే గురువారం హజ్ యాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుందని అరబిక్ భాషలో వెలువడుతున్న దినపత్రిక 'అల్ దియార్'లో ప్రచురితమైన ఒక వార్తాకథనం వెల్లడించింది. మరోవైపు, 700కు పైగా మంది యాత్రికులను బలిగొన్న తొక్కిసలాటకు కారకులెవరనేది తేల్చాలనే ఒత్తిడి సౌదీ ప్రభుత్వంపై వేగంగా పెరుగుతోంది. తొక్కిసలాటలో తమ దేశానికి చెందిన 131 మంది మృతి చెందడం పట్ల సౌదీ అరేబియాకు శత్రుదేశమైన ఇరాన్ మండిపడుతోంది. ఇస్లాంకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద యాత్ర అయిన హజ్‌ను నిర్వహించే సామర్థ్యం సౌదీ అరేబియాకు లేదని ఇరాన్‌కు చెందిన రాజకీయ నాయకులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా, సౌదీ యువరాజు సల్మాన్ అనేక మందిని వెంటపెట్టుకొని, భారీ భద్రత మధ్య గురువారం తెల్లవారు జామున మినాకు చేరుకున్నారని లెబనీస్ దినపత్రిక తన వార్తాకథనంలో వెల్లడించింది. దీంతో అధికారులు హజ్ యాత్రికుల ప్రయాణ దిశను మార్చాల్సి వచ్చిందని, అది తొక్కిసలాటకు దారితీసిందని వివరించింది. అయితే సల్మాన్, అతనితో పాటు వచ్చిన వారు త్వరగా సంఘటన స్థలం నుంచి వెళ్లిపోయారని, సౌదీ అధికారులు ఈ విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెడుతున్నారని పేర్కొంది. ఇదిలా ఉండగా, సౌదీ అధికారులు ఈ పత్రిక కథనాన్ని ఖండించారు. ఈ తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై త్వరగా విచారణను పూర్తి చేయిస్తామని పేర్కొంటూ సౌదీ ఆరోగ్య మంత్రి ఖలీద్ అల్ ఫాలిహ్ తన మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com