ఒకే వేదికపై తెలుగు హీరోలు ఈ నెల 28న
- March 21, 2017
28న హైదరాబాద్లో వేడుక ఒకే వేదికపై దక్షిణాది తారల సినీ సంబరం
చెన్నైలో నామినేషన్లు ప్రకటించిన రానా, జీవా
ప్రతి ష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డుల రేసులో 2016 ఏడాదికిగాను టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ పోటీపడుతున్నారు. వారితోపాటు అల్లు అర్జున్, నాని, విజయ్ దేవర కొండ ఉత్తమ కథానాయకుడి రేసులో ఉండగా, స్వీటీ అనుష్క, చెన్నై బ్యూటీ సమంత, కొత్తభామలు రితూవర్మ, ప్రగ్యా జైస్వాల్ ఉత్తమ కథానాయకి నామినేషన్లు సాధించారు. ఈనెల 28న హైదరాబాద్లో జరుగబోతున్న ఐఫా అవార్డు ప్రదానోత్సవ వేడుక సందర్భంగా దక్షిణాదిలోని నాలుగు సినీ పరిశ్రమల నుంచి 13 విభాగాల్లో నామినేషన్లను చెన్నైలో ప్రకటించారు.
ఐఫా డైరెక్టర్ ఆండ్రీ టిమిన్స్, రానా, జీవా తదితర సినీ ప్రముఖుల సమక్షంలో నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఐఫా అవార్డుల నామినేషన్లను వెల్లడించారు. ఈ సందర్భంగా ఐఫా డైరెక్టర్ మాట్లాడుతూ... తొలిసారిగా దక్షిణాది సినీ దిగ్గజాలను, సినీ తారలను ఒక వేదికపైకి చేర్చే ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరుపనున్నట్టు తెలిపారు. ఈ వేడుకలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలకు చెందిన సినీ తారలు, కళాకారులకు అవార్డులను ప్రదానం చేయనున్నామని, హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకను జరుపనున్నామని తెలిపారు.
ఈ వేడుకల్లో ప్రముఖ సినీతారలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్చరణ్, మహేశ్బాబు, శివరాజ్ కుమార్, రవిచంద్రన్, మోహన్ లాల్, జీవా, వెంకట్ ప్రభు, రానా దగ్గుబాటి, నాజర్, జయం రవి, జాన్విజయ్ తమన్నా, సమంత, అనుష్క, రకుల్ప్రీత్, మమతా మోహన్దాస్, ఖుష్బూ, తదితరులు పాల్గొంటారని ఆయన తెలి పారు. ఇక ఐఫా వేడుకకు తెలుగు సిగ్మంట్కు రానా, తమిళ సిగ్మంట్కు యువ నటుడు శివ కార్తికేయన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. విలేఖరుల సమావేశంలో పాల్గొన్న రానా మాట్లాడుతూ... హైదరాబాద్ వేదికగా దక్షిణాది తారలను ఐఫా సత్కరించనుండటం హర్షణీయమని, రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుక అభిమానులకు కన్నులపండువగా ఉంటుందని అన్నారు.
ఐఫా సంస్థ తొలిసారిగా దక్షిణాదిలో ఈ వేడుకలను జరుపటం అభినందనీయమని తమిళ నటుడు జీవా పేర్కొనగా.. దక్షిణాది తారలందరినీ ఒకే వేదికపై సత్కరించేందుకు సమాయత్తమవుతున్న ఐఫా సంస్థను మనసారా అభినందిస్తున్నానని, సినీ తారల కృషికి గుర్తింపునిచ్చేవి ఐఫా వంటి సంస్థ లిచ్చే అవార్డులేనని నటి వరలక్ష్మి శరత్ కుమార్ పేర్కొంది. ఈ సమావేశంలో అదానీ విల్మర్ లిమిటెడ్ సీఓఓ అంగ్ షూమాలిక్, రేనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ మేనే జింగ్ డైరెక్టర్ సుమిత్ స్వాహ్నీ, ఐఫా ఉత్సవం జ్యూరీ సభ్యుడు పి. వాసు, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్య దర్శి కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టాలీవుడ్ నామినేషన్లు ఇవే... మొత్తం 13 కేటగిరీలలో ఐఫా అవార్డుల ను ప్రదానం చేయనున్నారు. తెలుగులో ఉత్తమ చిత్రంగా 'ఊపిరి', 'జనతా గ్యారేజ్', 'పెళ్లిచూపులు', 'క్షణం', 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు పోటీపడుతుండగా, ఉత్తమ హీరో విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్), రామచరణ్ (ధ్రువ), నాని (కృష్ణ గాడి వీర ప్రేమగాథ), అల్లు అర్జున్ (సరైనోడు), విజయ్ దేవరకొండ (పెళ్లిచూపులు), ఉత్తమ హీరోయిన్ విభాగంలో అనుష్క (రుద్రమ దేవి, సైజ్ జీరో), సమంత (అఆ), రీతూవర్మ (పెళ్లి చూపులు), ప్రగ్యా జైస్వాల్ (కంచె) రేసులో ఉన్నారు. ఉత్తమ దర్శకుడిగా కొరటాల శివ (జనతా గ్యారేజ్), సుకుమార్ (నాన్నకు ప్రేమతో), వంశీ పైడిపల్లి (ఊపిరి), క్రిష్ (కంచె), తరుణ్ భాస్కర్ (పెళ్లి చూపులు) పోటీపడుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







