త్వరలో రానున్న రూ.200 నోటు

- July 28, 2017 , by Maagulf
త్వరలో రానున్న రూ.200 నోటు

రూ.2వేల నోటు రద్దుకు సంబంధించి సమాచారం లేదని, ఆర్‌బీఐ తీసుకురానున్న రూ.200 నోటు మాత్రం త్వరలో చలామణీలోకి వస్తుందని ఆర్థిక శాఖ సహాయమంత్రి సంతోష్‌కుమార్‌ గాంగ్వార్‌ తెలిపారు. ఓ న్యూస్‌ ఏజెన్సీకిచ్చిన ఇంటర్వ్యూలో గాంగ్వార్‌ మాట్లాడుతూ రూ.200 నోట్ల ముద్రణ ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే కొత్త కరెన్సీని విడుదల చేస్తామని పేర్కొన్నారు. రూ.2వేల నోట్ల రద్దు అంశంపై ఆయన మాట్లాడుతూ దానిపై ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఆ నోటు ముద్రణ నిలిపివేయడం గురించి మాట్లాడుతూ ‘అది వేరే వ్యవహారం. అయినా ఆర్‌బీఐ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంది. దానిపై ఆర్‌బీఐ స్పష్టత ఇస్తుంది’ అని చెప్పారు. 

పెద్దనోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన రూ.2వేల నోటును రద్దు చేస్తారంటూ వూహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 26న రాజ్యసభలో విపక్షాలు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. దీనిపై సభలోనే ఉన్న జైట్లీ ఎలాంటి సమాధానం చెప్పకపోవడం గమనార్హం. దీంతో రూ.2వేల నోటును భవిష్యత్‌లో రద్దు చేస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత ఏర్పడలేదు. మరోవైపు ఇప్పటికే రూ. 2000 నోట్ల ముద్రణ ప్రక్రియను నిలిపివేశారని తెలుస్తోంది. మరోవైపు అధికార వర్గాల సమాచారం మేరకు ఆగస్టులో రూ.200 నోట్లు చలామణీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మైసూరులోకి ముద్రణాలయంలో ఆర్బీఐ అధికారుల పర్యవేక్షణలో కొత్త నోట్లను ముద్రించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com