248 కి చేరిన మెక్సికో భూకంప మృతుల సంఖ్య

- September 20, 2017 , by Maagulf
248 కి చేరిన మెక్సికో భూకంప మృతుల సంఖ్య

మెక్సికో భూకంప మృతుల సంఖ్య 248కి చేరింది. మెక్సికో సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని ప్రకటించింది. ఇప్పటివరకూ మోరేలోస్‌లో 55 మంది మృతి చెందగా.. మెక్సికో సిటీలో 49 మంది, పూబ్లాలో 32 మంది చనిపోయారు. ఇంకా సహాయక చర్యలు  కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారిని స్థానికులు, సహాయక సిబ్బంది కాపాడుతున్నారు.

నగరంలోని ఒక ఎలిమెంటరీ స్కూల్ కుప్పకూలడంతో 21 మంది విద్యార్థులసహా చాలా మంది మృతి చెందారు. ఒక చర్చి కూలిపోవడంతో 15 మంది మృతి చెందారు. మెక్సికో ప్రిసెడెంట్ పేనా నీటో ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కోరారు. 500 మంది సైనికులు, నావీ దళాలు సహాయక చర్యల్లో ఉన్నాయి.  అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 

7.1 తీవ్రతతో భూకంపం తర్వాత 11 ఆఫ్టర్ షాక్స్ వచ్చాయి. ప్రపంచ దేశాల నేతలందరూ మెక్సికో భూకంప మృతులకు తమ సంతాపం ప్రకటించారు. బాధితులకు తమ దేశం అండగా ఉంటుందని తెలిపారు. యూఎస్ జియాలజికల్ సర్వే భూకంపం మృతుల సంఖ్య వెయ్యికి చేరవచ్చని భావిస్తోంది. ఒక బిలియన్ నుంచి 10 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగుంటుందని అంచనా వేసింది.

శాన్ జువాన్ రబోసోకు 4.5 కిలోమీటర్లు, ప్యూబెలా సిటీకి 55 కిలోమీటర్ల దూరంలో  దూరంలో ఎపిక్ సెంటర్ ఉంది.. భూకంపానికి 70 కిలోమీటర్ల పరిధిలో నష్టం తీవ్రంగా ఉంటుంది. దీంతో సైన్యం అప్రమత్తమైంది. మెక్సికో సిటీలో, ప్యూబ్లా, గారేరో స్టేట్స్‌లో అన్ని స్కూళ్లకూ సెలవులు ప్రకటించారు. మెక్సికో ఎయిర్ పోర్ట్ మూసేశారు. రన్ వేలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలుస్తోంది. 1985 సెప్టెంబర్‌ 19న కూడా భారీ భూకంపం మెక్సికోను ధ్వంసం చేసింది. 8 రెక్టార్ స్కేలు తీవ్రతతో వచ్చిన భూకంపంలో దాదాపు 9500 మంది మృతి చెందారు. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే రోజు మెక్సికో మరోసారి భూ ప్రకంపనలతో ఊగిపోయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com