జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ అధికారులు

- October 14, 2017 , by Maagulf
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసిన సిట్ అధికారులు

జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కీలక పురోగతి సాధించింది. ఆమెను హత్య చేసిన ముగ్గురు నిందితులను గుర్తించింది. ఒక సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేసింది. ఆ దృశ్యాలను టీవీ 5 ఎక్స్‌ క్లూజివ్‌గా సంపాదించింది. ముగ్గురు నిందితుల ఊహా చిత్రాలు రూపొందించి విడుదల చేసింది. నిందితులను గుర్తించడంలో ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలంటూ నిరసనలు వెల్లువెత్తుతుండడంతో సిట్ దీనిపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.

సెప్టెంబర్‌ 5న కారులో ఇంటికొచ్చిన గౌరీ లంకేష్‌.. మెయిన్‌ గేటు తీస్తుండగా దుండగులు ఆమెపై దగ్గర్నుంచి కాల్పులు జరిపారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. అప్పటికే కాపుకాసిన దుండగులు.. కాల్పులు జరిపిన తర్వాత బైక్ పై పారిపోయారు.  దుండగులు పక్కా రెక్కీ నిర్వహించే ఈ హత్య చేసినట్టు ఈ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది.

సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. హంతకుల ఆచూకీ తెలిపినవారికి పది లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. గౌరీ లంకేష్ హత్యను రాజకీయ పార్టీల నేతలు, మేధావులు ఖండించారు. గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనలకు దిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com