టాలీవుడ్‌లో నందమూరి వారి 'మల్టీస్టారర్‌' జోరు

- November 04, 2017 , by Maagulf
టాలీవుడ్‌లో నందమూరి వారి 'మల్టీస్టారర్‌' జోరు

మల్టీస్టారర్‌.. గతంలో టాలీవుడ్‌ ఈ మాట అంతగా వినిపించేది కాదు. అలనాటి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కాలంలో ఆ తరహాలో కొన్ని చిత్రాలు వచ్చినా.. ఆ తరువాతి తరంలో వాటి ప్రస్తావన అంతంత మాత్రంగానే ఉండేది. ఐదారేళ్ల క్రితం కొంతమంది నటులు మల్టీస్టారర్‌ దిశగా అడుగులు వేయడంతో వచ్చిన అరుదైన కాంబినేషన్లకు ప్రేక్షకులు మంచి విజయాలను కట్టబెట్టారు. ఇటీవల ఆ సంఖ్య కాస్త తగ్గినా.. త్వరలోనే మళ్లీ మల్టీస్టారర్‌ చిత్రాలు వరుస కట్టబోతున్నాయి. ఇదే జోరు కొనసాగితే మూడునెలలకు ఒకసారైనా మల్టీస్టారర్‌ చూడొచ్చు. ప్రస్తుతం నిర్మాణం, ఆలోచనల్లో ఉన్న సినిమాలు ఇవీ.. బాలకృష్ణ- కల్యాణ్‌రామ్‌ విభిన్న కథలను ఎంచుకుంటూ చిత్రాలను చేసే నటుడు నందమూరి బాలకృష్ణ. తన ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా కనిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే బాలయ్య చేసే సినిమాలన్నీ దేనికదే భిన్నంగా ఉంటాయి. తన తండ్రి ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఆ చిత్రానికి తేజ దర్శకుడు.

ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను ఈ సినిమాలో పొందుపరచనున్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినపుడు రాష్ట్రవ్యాప్తంగా చైతన్యరథంపై తిరిగి కొన్ని లక్షల కుటుంబాలను స్వయంగా కలుసుకున్నారు. ఆ సమయంలో ఆయన తిరిగిన చైతన్యరథాన్ని ఆయన తనయుడు హరికృష్ణే స్వయంగా నడిపారు. త్వరలో బాలయ్య చేయనున్న చిత్రంలోనూ చైతన్యరథం నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించనున్నారట.

నిజ జీవితంలో హరికృష్ణ పోషించిన పాత్రకు ఆయన తనయుడు కల్యాణ్‌రామ్‌ను చిత్రబృందం ఎంపిక చేసింది. కాబట్టి నందమూరి కుటుంబం నుంచి ఇటీవల కాలంలో రానున్న తొలిచిత్రం మల్టీస్టారర్‌ ఇదే కానుంది. చిరు-పవన్‌-త్రివిక్రమ్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్‌ రూపొందనుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివ్రిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్నారు.

వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌,సుబ్బరామిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రం పూర్తయ్యాక ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. ఆ సినిమా కూడా పూర్తయ్యాకే చిరు-పవన్‌ చిత్రం పట్టాలెక్కే అవకాశముంది.

ఈ లెక్కన దీనికి కనీసం ఓ ఏడాదైనా పడుతుంది. నాగార్జున-నాని అక్కినేని నాగార్జున, నాని ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను ఇప్పటికే చిత్రబృందం మొదలుపెట్టేసిందట. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో నిర్మించే ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు.

పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో నాగార్జున పాత్రను సినిమా విడుదల వరకు రివీల్‌ చేయకూడదని భావిస్తున్నట్లు సమాచారం. వెంకటేశ్‌- నాగచైతన్య ఈ ఇద్దరు మామా, అల్లుళ్లు కలిసి ఓ సినిమా చేస్తారని టాలీవుడ్‌లో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చనుంది.

'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్‌ వేడుక చూద్దాం' లాంటి కుటుంబ కథాచిత్రాలతో మంచి విజయాలను అందుకున్న కల్యాణ్‌కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం కూడా పూర్తిస్థాయి కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కన్నట్లు తెలుస్తోంది. మల్టీస్టారర్‌ 'మహానటి' ప్రముఖ నటి సమంత, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఇప్పటికే ఈ చిత్రం సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటిస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కన్పించనున్నారు.

ఇటీవల విడుదల చేసిన ఆ సినిమా ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. అంతేకాకుండా ఇటీవల వరుస విజయాలు అందుకుంటున్న యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే రెండు మల్టీస్టారర్‌ చిత్రాలు చేసిన ఓ సీనియర్‌ నటుడు, మరో యువ నటుడు దీనిలో నటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com