రాహుల్‌ పట్టాభిషేకానికి సోనియా వ్యూహాలు.!

- November 19, 2017 , by Maagulf
రాహుల్‌ పట్టాభిషేకానికి సోనియా వ్యూహాలు.!

కాంగ్రెస్‌లో కొత్త అధ్యాయం మొదలు కానుంది.. యువరాజు రాహుగాంధీకి పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ నిర్ణయించనున్న అధిష్టానం.. రాహుల్‌ ఏకగ్రీవంగా ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎన్నికలను లాంఛనం చేయనుంది. 19 ఏళ్ల సోనియా అధినాయకత్వానికి వారసుడుగా ఐదవ తరం గాంధీగా రాహుల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాహుల్ పట్టాభిషేకానికి మరో అడుగు ముందుకు పడింది. పార్టీ అధినేత్రి సోనియా నేతృత్వంలో నేడు సమావేశం కానున్న సీడబ్ల్యూసీ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఈ తంతు పూర్తి కాగానే వీలైనంత త్వరగా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని, రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్ పట్టాభిషేకం యూపీ ఎన్నికలకు ముందే జరగాల్సి ఉన్నా, అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ రెండుసార్లు గడువు పెంచగా.. డిసెంబరు 31 నాటికి ప్రక్రియ ముగించాలని అధిష్టానం భావిస్తోంది.. రాహుల్‌ను ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకునేలా సోనియా ఇప్పటికే ఒక వ్యూహం సిద్ధం చేశారు. గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు డౌటేనని ఇప్పటికే వెల్లడైన సర్వేలు చెబుతున్నాయి. గుజరాత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు రాహుల్‌. ఒకవేళ అక్కడ విజయం సాధించలేకపోతే రాహుల్‌ సామర్థ్యంపై విమర్శలు వెల్లువెత్తే ప్రమాదం ఉంది. పార్టీలోనూ అసమ్మతి గళం పెరగొచ్చు. ఇదే జరిగితే, ఇక రాహుల్‌కు అధికార పీఠం అందే అవకాశాలు ఉండవు. అందుకే.. అన్నీ ఆలోచించుకునే ముందే జాగ్రత్త పడుతున్నారు సోనియాగాంధీ.

సోనియా నివాసం 10 జన్‌పథ్‌లో ఉదయం 10.30కు సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో షెడ్యూల్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించగానే పార్టీ కేంద్ర ఎన్నికల విభాగం దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. డిసెంబర్‌ 9 నుంచి గుజరాత్ ఎన్నికలు ప్రారంభం కానుండడంతో ఆ లోపే రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com