తెలుగు మహాసభల కోసం కేబినెట్ సబ్ కమిటీ

- December 04, 2017 , by Maagulf
తెలుగు మహాసభల కోసం కేబినెట్ సబ్ కమిటీ

తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రపంచ తెలుగు మహాసభలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలుగు మహాసభల ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు.  తెలుగు మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణకు కేబినెట్ సబ్ కమిటీని సీఎం నియమించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో వేసిన కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, చందులాల్ కొనసాగనున్నారు. సాహిత్య అకాడమీ, ఇతర సంస్థల సమన్వయంతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించనుంది. తెలుగు మహాసభలు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే తెలుగు మహాసభలకు సంబంధించి పలు చోట్ల సన్నాహక సమావేశాలు నిర్వహించారు.

ప్రగతి భవన్‌లో సమీక్ష ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్.. ఎల్బీ స్టేడియానికి చేరుకుని తెలుగు మహాసభల ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లలో ఎక్కడా లోపం లేకుండా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. మహాసభలకు వచ్చే వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తెలుగు మహాసభల ఏర్పాట్లను చకచక పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ వెంబడి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో పాటు అధికారులు ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com