అమెరికాకు సందర్శనార్ధం విచ్చేసే భారతీయుల సంఖ్యా గణనీయంగా తగ్గింది

- December 18, 2017 , by Maagulf
అమెరికాకు సందర్శనార్ధం విచ్చేసే భారతీయుల సంఖ్యా గణనీయంగా తగ్గింది

న్యూదిల్లీ: అమెరికాను సందర్శించే భారతీయుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో సుమారు 13శాతం మేర ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. నోట్ల రద్దుతో పాటు, వీసాల జారీ ప్రక్రియలో అమెరికా జాప్యం ఇందుకు దోహదం చేశాయని పర్యాటక అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల అమెరికా జాతీయ రవాణా, పర్యాటక కార్యాలయం ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం తొలి ఆరునెలల్లో (జనవరి-జూన్‌) ఇండియా నుంచి అమెరికా వచ్చే వారి సంఖ్య 12.9 శాతం మేర తగ్గిందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో ఆ సంఖ్య 18.3గా ఉందని తెలిపింది. 

ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో భారత్‌ నుంచి వచ్చే వారి సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టిందని, దాని ప్రభావం స్వల్పకాలం మాత్రమే ఉంటుందని బ్రాండ్‌ యూఎస్‌ఏ ప్రెసిడెంట్‌, సీఈవో క్రిస్‌ థామ్సన్‌ పేర్కొన్నారు. భారత్‌లో గతేడాది కాలంగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇందుకు కారణమయ్యాయని చెప్పారు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు ప్రభావితం చేసిందన్నారు. అయితే ట్రంప్‌ వలసవాద విధానాలు ప్రభావితం చేశాయనడాన్ని ఆయన కొట్టిపారేశారు. డిమాండ్‌కు తగ్గ వీసాలను జారీ చేయలేకపోవడమే ఇందుకు కారణమయ్యాయని చెప్పారు. 
2016లో 11.7 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించి 1.36 లక్షల డాలర్ల ఆదాయాన్ని సమకూర్చారని, అది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 14 శాతం అధికమని థామ్సన్‌ చెప్పారు. 2016తో పోలిస్తే 2021 నాటికి సందర్శకుల సంఖ్య 72 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఇరు దేశాల మధ్య నేరుగా ప్రయాణించే విమానాల సంఖ్య, సహకారం పెరగడం వంటివి సంఖ్య పెరుగుదలకు, పర్యాటకాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com