కోటీశ్వరులుగా మారిన పేటీఎం ఎంప్లోయస్ !

- January 30, 2018 , by Maagulf
కోటీశ్వరులుగా మారిన పేటీఎం ఎంప్లోయస్ !

న్యూఢిల్లీః పేటీఎంకు చెందిన 100 మందికిపైగా ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరులయ్యారు. పేటీఎం ఈ మధ్యే తమ స్టాక్‌లను అమ్మడం ద్వారా రూ.500 కోట్లు కూడగట్టిన విషయం తెలిసిందే. గతేడాది జూన్‌లో తొలిసారి ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్ (ఈఎస్‌ఓపీ) అమ్మకాలను చేపట్టడం ద్వారా రూ.200 కోట్లు సంపాదించిన పేటీఎం.. తాజాగా రెండోసారి మరో రూ.300 కోట్లను రాబట్టింది. ఈ షేర్ల అమ్మకాల ద్వారా పేటీఎంలోని 20 నుంచి 25 మంది ఉద్యోగులు కనీసం రూ.6 కోట్లు (మిలియనీర్) అంతకన్నా ఎక్కువ సంపాదించారు. ఇందులో పేటీఎం కెనడా సీఈవో హరీందర్ టఖార్ కూడా ఉన్నారు. ఆయన షేర్ల అమ్మకం ద్వారా రూ.40 కోట్ల సంపాదించారు. అంతేకాదు పేటీఎంలోని ఓ ఆఫీస్ బాయ్ కూడా రూ.20 లక్షలు సంపాదించడం విశేషం. వన్97 అనే సంస్థ పేటీఎంకు యజమాని అన్న విషయం తెలిసిందే. దీని వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ. ప్రస్తుతం పేటీఎం మార్కెట్ విలువ వెయ్యి కోట్ల డాలర్లుగా ఉన్నది. గతేడాది కంటే ఈ సంస్థ విలువ 300 కోట్ల డాలర్లు పెరగడం విశేషం.

ఈ మధ్యే పేటీఎంలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్‌లో ఉన్నత, మధ్య స్థాయి ఉద్యోగులనే కాకుండా.. మొదటి నుంచీ సంస్థలో ఉన్న ఉద్యోగులందరినీ భాగస్వాములను చేశారు. ఇప్పుడు ఆ స్టాక్‌లను అమ్ముకునే అవకాశం ఇవ్వడం వల్ల వాళ్లంతా లక్షలు, కోట్లు సంపాదించే వీలు కలిగిందని పేటీఎం ప్రతినిధి తెలిపారు.

గతేడాది విజయ్ శేఖర్ శర్మ కూడా తన పేరిట ఉన్న ఒక శాతం స్టాక్‌ను అమ్మి రూ.325 కోట్లు కూడగట్టుకున్నారు. దీనిని పేటీఎం బ్యాంక్ బిజినెస్‌లో పెట్టుబడిగా పెట్టారు. గతేడాది డిసెంబర్‌లో ఫ్లిప్‌కార్ట్ కూడా ఇలాగే ఈఎస్‌ఓపీలను తనే పది కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com