నేపాల్ ప్రధానిగా రెండోసారి ఆయనే..భారత్‌కు ఇబ్బందే

- February 15, 2018 , by Maagulf
నేపాల్ ప్రధానిగా రెండోసారి ఆయనే..భారత్‌కు ఇబ్బందే

కఠ్మాండు: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సీపీఎన్-యూఎంఎల్ ఛైర్ పర్సన్ ఖడ్గ ప్రసాద్ శ‌ర్మ‌ ఓలి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రెండు నెలల తర్వాత ఓలి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. ఆ దేశ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి 65ఏళ్ల ఓలిని నేపాల్ 41వ ప్రధానిగా నియమించారు. చైనాకు అనుకూలంగా వ్యవహరించే ఓలి గతంలో అక్టోబరు 2015 నుంచి ఆగస్టు 2016 వరకు ప్రధానిగా పనిచేశారు. ప్రధాని అభ్యర్థిత్వానికి ప్రధాన పార్టీలు యూసీపీఎన్-మావోయిస్ట్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ(నేపాల్), మాధేశీ రైట్స్ ఫోరమ్-డెమోక్రటిక్‌తో పాటు 13 చిన్న పార్టీలు మద్దతు తెలిపాయి. అంతకుముందు షేర్ బహదూర్ జాతినుద్దేశిస్తూ కీలక ప్రసంగం చేసి తన రాజీనామాను బిద్యా దేవికి సమర్పించారు. పొరుగు దేశం చైనాకు అనుకూలంగా ఉండే ఓలితో సరిహద్దు దేశం భారత్‌కు కొంచెం ఇబ్బందికరమైన విషయమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత్-భూటాన్-టిబెట్(చైనా) సరిహద్దు ప్రాంతం డోక్లాంలో చైనా సైనికులను మోహరించి భారత్‌ను దెబ్బకొట్టేందుకు డ్రాగన్ వ్యూహాలు పన్నిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com