పండ్ల రసాల తయారు చేసే మెషీన్లలో 18 లక్షల మాదక ద్రవ్యాల మాత్రలు

- March 06, 2018 , by Maagulf
పండ్ల రసాల తయారు చేసే మెషీన్లలో 18 లక్షల మాదక ద్రవ్యాల మాత్రలు

దుబాయ్:మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసే స్మగ్లర్లు నానాటికి విభిన్న పద్ధతులను ఆశ్రయిస్తూ పోలీసుల కళ్ళు గప్పేందుకు శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. అధికారులు వారి ఎత్తుగడలను నిత్యం చిత్తు చేస్తూనే ఉన్నారు. రోడ్డుపై వేగంగా ఓ వాహనం వెళుతుంది.. ఆ మార్గంలో పహారా ఉన్న నిఘా పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు. తనిఖీ నిమిత్తం వాహనం లోపల తొంగి చూస్తే  జ్యూస్‌లు తయారుచేసే మెషీన్లు ఉన్నాయి. మండే వేసవి కదా ...సీజనులో ఇవి రవాణా కావడం మామూలే కదా అని వదిలిపెడితే స్మగ్లర్లు ఎంతో లాభపడిపోయేవారు. దూర దృష్టి కాస్త ఎక్కువ పాళ్ళు ఉన్న దుబాయ్ పోలీసులు  వాహనం క్షుణంగా పరిశీలించేందుకు జ్యూస్ పరికరాలని కిందకు దింపించారు. ఆ జ్యూస్ మెషీన్ల విడి భాగాలను ఒక్కొకటి విడదీసి  చూస్తే..ఆశ్చర్య పోయేలా 18 లక్షల కాప్టగాన్ మాత్రలు  బయటపడ్డాయి. ఈ మాదకద్రవ్య మాత్రలు తీసుకొనేవారిని  మెలకువగా ఉంచే, శారీరక నొప్పిని తగ్గించే, మానసిక ఉత్సాహాన్ని పెంచేవే కాప్టగాన్ పిల్స్. వీటిని ఎక్కువగా ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు వాడుతుంటారు. అందుకే వీటిపై పలు దేశాల్లో నిషేధం ఉంది. సోమవారం దుబాయి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు.. అబూదబీ పోలీసులతో కలిసి భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. 18 లక్షల కాప్టగాన్ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 159 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీటి అక్రమ రవాణాకు పాల్పడిన అయిదుగురు అరబ్ పౌరులను అరెస్ట్ చేసి విచారించి త్వరలో మొత్తం గుట్టు విప్పుతామని పోలీసులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com