రవి తేజ 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' షురూ..

- March 08, 2018 , by Maagulf
రవి తేజ 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' షురూ..

రవితేజ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శ్రీనువైట్ల పెద్ద కుమార్తె ఆనంది వైట్ల క్లాప్‌కొట్టగా, రెండో కుమార్తె ఆద్య వైట్ల కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కథానాయకుడు రవితేజ దర్శకుడికి స్క్రిప్టుని అందజేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ''ఆకర్షణీయమైన కలయికలో రూపొందుతున్న చిత్రమిది. 'దుబాయ్‌ శీను' తర్వాత రవితేజ, శ్రీనువైట్ల కలిసి చేస్తున్న చిత్రాన్ని మేం నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది. మా సంస్థకి ఇదొక ప్రత్యేకమైన చిత్రం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తామ''న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''యేడాది కిందటే ఈ కథకి బీజం పడింది. పది నెలల పాటు కష్టపడి స్క్రిప్టు పనుల్ని పూర్తి చేశాం. నిర్మాతలకి, కథానాయకుడికీ కథ చాలా బాగా నచ్చింది. నా హీరో రవితేజతో మళ్లీ ఇన్నాళ్లకి కలిసి చిత్రం చేస్తుండడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ అమెరికాలోని న్యూయార్క్‌, డెట్రాయిట్‌, సాల్ట్‌ లేక్‌ సిటీ తదితర ప్రాంతాల్లో జరుపనున్నాం. అత్యధిక శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకొంటున్న మొట్టమొదటి తెలుగు చిత్రమిది. ఇందులో సునీల్‌ హాస్య ప్రధానమైన ఓ పూర్తి స్థాయి పాత్రని పోషిస్తున్నారు. అలాగే నిన్నటితరం కథానాయిక లయ, ఆమె కుమార్తె శ్లోక, రవితేజ తనయుడు మహాధన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లంతా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తార''న్నారు. అభిమన్యు సింగ్‌, తరుణ్‌ అరోరా, విక్రమ్‌జీత్‌సింగ్‌, రాజ్‌వీర్‌ సింగ్‌, సాయాజీషిండే, ఆదిత్య మేనన్‌, వెన్నెల కిషోర్‌, సత్య, జయప్రకాష్‌రెడ్డి, షకలక శంకర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ సి.దిలీప్‌, కథ: శ్రీనువైట్ల, వంశీ రాజేష్‌ కొండవీటి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com