ఫ్రాన్స్‌లో మరోసారి రక్తపాతం

- March 23, 2018 , by Maagulf
ఫ్రాన్స్‌లో మరోసారి రక్తపాతం

ఫ్రాన్స్‌:ఫ్రాన్స్‌లో ఇస్లామిక్ టెర్రరిజం మరోసారి రక్తపాతం సృష్టించింది. ఒక సూపర్ ‌మార్కెట్‌లో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్న ఐసిస్ ఉగ్రవాది మొత్తం ముగ్గురిని కాల్చి చంపాడు. లొంగిపోవాలని వార్నింగ్ ఇచ్చినా వినకపోవడంతో యాంటీ టెర్రర్ టీమ్స్ ఉగ్రవాదిని కాల్చి చంపాయి. టెర్రర్ అటాక్‌లో గాయపడ్డ ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

2012 నుంచి ఐసిస్ ఉగ్రవాదులకు లక్ష్యంగా మారిన ఫ్రాన్స్‌ మరోసారి కాల్పులతో  దద్దరిల్లింది. నైరుతి ఫ్రాన్స్‌లో ఉన్న టెబ్రిస్ పట్టణంలో టెర్రర్ అటాక్ జరిగింది. ప్రయాణికుడిని చంపి, డ్రైవర్‌ను గాయపరిచి ఒక కారు  హైజాక్ చేసి ఉగ్రవాది పట్టణంలోని ఒక సూపర్‌మార్కెట్‌లో చొరబడ్డాడు. 3 గంటలపాటు లోపలున్న వారందరినీ బందీలుగా పట్టుకుని టెర్రర్ క్రియేట్ చేశాడు. ఉగ్రవాదిని 26 ఏళ్ల రదౌనీ లక్దిమ్‌గా గుర్తించారు.

లోపలున్న వారందరూ సురక్షితంగా తప్పించుకోగా.. ఒక మహిళను మాత్రం లక్దిమ్ బందీగా పట్టుకున్నాడు. దీంతో ఆమెను తప్పించడానికి ఒక పోలీస్... ఉగ్రవాది దగ్గరకు బందీగా వెళ్లాడు. కొందరిని జైల్లోంచి విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఉగ్రవాది.. అధికారులు దానికి ఒప్పుకోక పోవడంతో తన దగ్గరున్న పోలీస్ ఆఫీసర్‌ను కాల్చి చంపాడు. దీంతో యాంటీ టెర్రరిస్ట్ టీమ్.. ఉగ్రవాదిని కూడా కాల్చి చంపింది. 

ఈ దాడిలో మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరుపుతున్నప్పుడు టెర్రరిస్ట్ అల్లాహో అక్బర్ అని అరిచినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దేశంపై మరోసారి ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి జరిగిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రకటించారు. ఉగ్రవాది దగ్గరకు బందీగా వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారిని హీరోగా వర్ణించారు. 2015 నుంచి ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఫ్రాన్స్‌లో 240 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com