సీఎం చంద్రబాబు హై అలర్ట్.. కొద్ది గంటల్లో ఆ మీటింగ్..

- March 26, 2018 , by Maagulf
సీఎం చంద్రబాబు హై అలర్ట్.. కొద్ది గంటల్లో ఆ మీటింగ్..

ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు విషయంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు టీడీపీ ప్రయత్నలు వేగవంతం అయింది. తన పోరాట పంథాను మార్చింది. అన్ని పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు అఖిల సంఘాల సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఇక లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంపీలను అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు. అలాగే.. అమిత్‌ షా ఆరోపణలు అవాస్తవమని నిరూపించేలా ఆధారాలతో ఘాటైన లేఖాస్త్రాన్ని సంధించబోతున్నారు.

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రావొచ్చన్న సంకేతాలతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే ఆంధ్రప్రదేశ్‌ కు జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో వినిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ చర్చ సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రకటించడంతో.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీలకు సూచించారు. నాలుగేళ్లైనా విభజన చట్టంలోని 19 అంశాలను అమలు చేయకపోవడాన్ని.. ప్రశ్నించాలన్నారు. ఇది చాలా కీలక సమయమన్న చంద్రబాబు లోక్‌సభలో 5కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష ప్రతిధ్వనించాలన్నారు. పసుపు చొక్కాలు, కండువాలతో సభకు హాజరు కావాలని ఆదేశించారు. ఏపీని ఒంటరిని చేయాలనే బీజేపి ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆదేశించారు. 

బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లెటర్‌కు కౌంటర్ లెటర్ రాయాలని చంద్రబాబు నిర్ణయించారు. అమిత్‌షా లేఖలోని ప్రతీ అంశానికి వాస్తవాలు వివరించున్నారు. కేంద్రం ఇచ్చిన 11వేల 592కోట్ల నిధులకు యుసీలు ఇవ్వలేదన్న షా ఆరోపణలకు ఆధారాలు చూపనున్నారు. యూసీలకు ప్రభుత్వ వైబ్‌సైట్లో పొందు పరచిన ఆధారాలను లేఖకు జతచేయనున్నారు. సోలార్‌ పార్క్‌ కు కేంద్రం 800కోట్లు ఇవ్వగా.. అమిత్‌ షా తన లేఖలో24వేల కోట్లుగా చూపడాన్ని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ద్వారా ఏపీకి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న చెప్పాలని అమిత్ షా కు రాసే లేఖలో సవాల్ చేయనున్నారు. 

విభజన హామీల అమలును రాజకీయ కోణంలో బీజేపీ చూస్తోందని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఒడిశాలో పార్టీకి నష్టం వస్తుందనే.. విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటాన్ని టీడీపీ ఉధృతం చేసింది. అన్ని పార్టీలతో అఖిల సంఘాల సమావేశాన్ని సీఎం చంద్రబాబు నిర్వహించబోతున్నారు. ఒక్కో రాజకీయ పార్టీ, ఉద్యమ సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులు చొప్పున ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో అఖిల సంఘాల నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com