అరబ్‌ రాజ్యంలో మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లలో సినిమా

- April 05, 2018 , by Maagulf
అరబ్‌ రాజ్యంలో మూడు దశాబ్దాల తర్వాత థియేటర్లలో సినిమా

రియాద్‌ : అరబ్‌ రాజ్యంలో పెను మార్పులు రానున్నాయి. సౌదీ అరేబియాలో  సినిమా యుగం మొదలవనుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సౌదీ ప్రజలు థియేటర్లలో సినిమాను చూడనున్నారు. దీనికి సంబంధించి ఆడియో విజువల్ మీడియా కమిషన్(ఏఎమ్‌సీ) రియాద్‌లోని ఓ థియేటర్‌కు లైసెన్స్‌ ఇచ్చింది. ఈ నెల 18న ఓ సినిమా ఈ థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటివరకూ సౌదీలో శాటిలైట్‌, డీవీడీలు, వీడియోల ద్వారా మాత్రమే సినిమాలను వీక్షించేవాళ్లు. 

చమురు విలువ తగ్గడంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ 2014 నుంచి కొన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణల్లో భాగంగా సౌదీ ప్రభుత్వం వినోదానికి పెద్ద పీట వేసింది. దీనిలో భాగంగా వచ్చే దశాబ్ద కాలంలో 64 బిలియన్ల డాలర్ల(యూఎస్‌) పెట్టుబడులతో  సౌదీలో థియేటర్లు, ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌, పార్కులు, టూరిస్టు హబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. కాగా థియేటర్లు ఏర్పాటయ్యాక తొలి దక్షిణ భారతీయ చిత్రం రజనీకాంత్ నటించిన 'రోబో 2.ఓ' అక్కడ విడుదల కానుంది.

1970 ప్రాంతంలో సౌదీలో సినిమాలు ఆడేవి. ఇస్లాం మ‌తానికి, సంస్కృతికి భంగం వాటిల్లుతుంద‌నే కార‌ణంగా 1980లో సినిమా హాళ్ల‌పై నిషేధం విధించారు. గతేడాది ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తున్న‌ట్లు సౌదీ అరేబియా ప్ర‌సార మంత్రిత్వ శాఖ తెలిపిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com