సంచలనంగా మారిన పాతికేళ్ల కుర్రాడి కార్ల స్కామ్‌

- April 21, 2018 , by Maagulf
సంచలనంగా మారిన పాతికేళ్ల కుర్రాడి కార్ల స్కామ్‌

తక్కువ ధరకే లగ్జరీ కార్లు అంటూ ప్రముఖుల్ని ట్రాప్‌ చేశాడు. 30 శాతం డిస్కౌంట్‌ ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించాడు. రూపాయి.. రెండు రూపాయలు కాదు.. ఏకంగా 30 కోట్లతో నొక్కేశాడు. రాత్రికి రాత్రే సైలెంట్‌గా విదేశాలకు చెక్కేశాడు. పాతికేళ్ల కుర్రాడు చేసిన ఈ స్కామ్‌ భాగ్యనగరంలో సంచలనంగా మారింది. ఈ ఘరానా దొంగను నమ్మి పలువురు ప్రముఖులు మోసపోయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో లగ్జరీ కార్ల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ఖరీదైన కార్లను తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ ఆకాష్‌ అనే యువకుడు పలువురు ప్రముఖులను నిండా ముంచేశాడు. 30శాతం డిస్కౌంట్‌తో వాహనాలు విక్రయిస్తానంటూ.. 30 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. బాధితుల నుంచి కంప్లైట్లు రావడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ముగ్గురి అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిని ఆత్మకూర్‌కు చెందిన ఆకాష్‌గా గుర్తించారు. తన స్నేహితులతో కలిసి గ్యాంగ్‌ ఏర్పాటు చేసిన ఆకాష్‌.. నగరంలోని కొన్ని షోరూమ్‌ల సిబ్బందితో డీల్‌ కుదుర్చుకున్నాడు. లగ్జరీ కార్లు కొనేందుకు కస్టమర్లను తీసుకొస్తానని.. అందులో డిస్కౌంట్‌ ఇవ్వాలని షరతు పెట్టాడు. ఆ తర్వాత పలువురు ప్రముఖులను ట్రాప్‌ చేశాడు. బెంజ్‌, వోల్వో, ఫోక్స్‌వ్యాగన్‌, బీఎండబ్ల్యూ, జాగ్వర్‌ లాంటి ఖరీదైన వాహనాలను.. 30 శాతం డిస్కౌంట్‌తో ఇప్పిస్తానంటూ ఆశ పెట్టాడు. వారిని నమ్మించేందుకు రెండు కోట్ల విలువైన కార్‌లో తిరుగుతూ పోజులు కొట్టాడు. అతడి లగ్జరీని చూసిన చాలామంది నిజంగానే తక్కువ ధరకు వాహనాలు వస్తాయని నమ్మేశారు. ఆకాష్‌ అండ్‌ గ్యాంగ్‌కు లక్షల రూపాయలను సమర్పించుకున్నారు.

ఆకాష్‌ మొదట్లో కస్టమర్లను నమ్మించేందుకు 30 లక్షల విలువైన కారును 21 లక్షలకే విక్రయించాడు. ఇలా ఏడు కార్లను కస్టమర్లకు డెలివరీ చేయడంతో.. ఆకాష్‌కు క్రేజ్‌ పెరిగిపోయింది. వందలమంది అతడి దగ్గరికి క్యూ కట్టారు. లక్షల రూపాయలను అతడి చేతిలో పోశారు. కస్టమర్ల నుంచి 30 కోట్ల దాకా వసూలు చేసిన ఆకాష్‌... ఉన్నట్టుండి గాయబ్‌ అయ్యాడు. దీంతో మోసపోయిన గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. లగ్జరీ కార్ల స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఆకాష్‌ బాధితుల్లో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఎంపీ కుమారుడు సైతం అతడి చేతిలో మోసపోయినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు కార్ల షోరూమ్‌ మేనేజర్‌ కాగా.. మిగతా ఇద్దరూ ఆకాష్‌ గ్యాంగ్‌ సభ్యులు. కాగా.. కోట్ల రూపాయలతో చెక్కేసిన ఆకాష్‌... ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com