తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం..

- July 21, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం..

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం..వాయు గుండంగా మారింది. ఈ వాయుగుండం ఒరిస్సా బాలాసోర్‌ సమీపంలో కేంద్రకృతమైంది. దీని ప్రభావంతో ఒరిస్సాతో పాటు ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏపీలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురువొచ్చు. రాయలసీమలో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉంది. ఇక తెలంగాణ అంతటా ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు.

వాయుగుండం ఎఫెక్ట్‌ తో ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు ఒడిస్సా నుంచి పోటెత్తిన వరద నీటితో నాగావళి, వంశదార నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు...వంశదార బ్యారేజ్‌ దగ్గర 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు వరదల ధాటికి మందస మండలం వీర గున్నమ్మపురం దగ్గర మహేంద్ర తనయా నదిపై నిర్మిస్తున్న తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. 

శ్రీకాకుళం జిల్లా తీరంలో గల్లంతైన మత్స్యాకారులు మరో నలుగురు కూడా సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలం కావటంతో చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తాపడింది. బోటులో ఎనిమిది మంది జాలర్లు ఉండగా..ముగ్గురు ఈదుకుంటు అర్ధరాత్రే ఒడ్డుకు చేరుకున్నారు. మరో నలుగుర్ని ఈ రోజు స్థానికులు రక్షించారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com