అట్టహాసంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం

- August 17, 2018 , by Maagulf
అట్టహాసంగా ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం

పాకిస్తాన్‌ 22వ ప్రధాన మంత్రిగా పీటీఐ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికయ్యారు. ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరగనుంది.. నేషనల్‌ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్‌లో పీటీఐ పార్టీకి చెందిన ఇమ్రాన్‌ ఖాన్‌ విజయం సాధించారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు 176 ఓట్లు వచ్చాయి. పీఎంఎల్ ఎన్ పార్టీకి చెందిన షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు వచ్చాయి. మొత్తం 342 మంది సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 172 మంది సభ్యుల కనీస మద్దతు అవసరం.. అయితే, ఇమ్రాన్‌ ఖాన్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా నాలుగు ఓట్లు అధికంగా వచ్చాయి. బ్యాలెట్‌ పద్ధతిలో సాగిన ఓటింగ్‌లో చివరి వరకు ఉత్కంఠ కనిపించింది. చివరకు ఇమ్రాన్ ఖాన్ ఎన్నిక ఖరారైంది.

కొత్తగా ఎన్నికైన స్పీకర్ అసద్ క్వైసర్ ఓటింగ్ ఫలితాలను వెల్లడించారు. ఓటింగ్ ఫలితాలను స్పీకర్ వెల్లడిస్తున్న సమయంలో కొంతమంది హౌజ్ సభ్యులు నినాదాలు చేశారు. విపక్ష పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తుండగా ఇమ్రాన్ ఖాన్ తన సీటులో కూర్చొని చిరునవ్వు చిందించారు.

జులై 25న జరిగిన ఎన్నికల్లో ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకోవడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నిక అనివార్యమైంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు నేషనల్ అసెంబ్లీలో తమ ఓట్లను ఇద్దరు పోటీదారులు ఇమ్రాన్ ఖాన్, షాబాద్ షరీఫ్‌కు వేశారు. పీపీపీ పార్టీ అభ్యర్థి కూడా ఈ పోటీలో నిలవాల్సి ఉన్నా.. పీఎంఎల్ ఎన్ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు పీపీపీ చైర్ పర్సన్ బిలావల్ బుట్టో జర్దారీ ఇదివరకే ప్రకటించారు. ఇక ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి సిద్ధూ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాక్‌ వెళ్లారు. ఇండియా దూతగా ఓ ప్రేమ సందేశంతో తాను పాకిస్తాన్‌ వచ్చినట్లు సిద్ధూ చెప్పుకొచ్చారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు బహుమతిగా ఇవ్వడానికి కశ్మీరీ శాలువాను తీసుకెళ్లారు సిద్ధూ. ఇక మాజీ క్రికెటర్లు గవాస్కర్‌, కపిల్‌దేవ్‌కు ఆహ్వానం అందినప్పటికీ, వ్యక్తిగత కారణాలతో వారు పాక్‌ వెళ్లడం లేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com