న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీ విమానంలో తాగుబోతు వీరంగం..మహిళపై మూత్రం పోసి..

- September 01, 2018 , by Maagulf
న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీ విమానంలో తాగుబోతు వీరంగం..మహిళపై మూత్రం పోసి..

న్యూఢిల్లీ:ఎయిరిండియా విమానంలో తప్పతాగిన ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలి పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించాడు. ఆమె ముందే ప్యాంటు విప్పి మూత్రం పోస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. శుక్రవారం న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై హతాశురాలైన బాధితురాలి కుమార్తె ట్విటర్ వేదికగా ఎయిరిండియాను నిలదీసింది. ''శుక్రవారం జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి బయల్దేరిన మీ విమానం ఏఐ102లో మా అమ్మకు దారుణ అనుభవం ఎదురైంది. మద్యం సేవించిన ఓ ప్రయాణికుడు తన ప్యాంటు విప్పి ఆమె కూర్చున్న సీటుపై మూత్రం పోశాడు! ఒంటరిగా ప్రయాణిస్తున్న మా అమ్మ ఇది చూసి నిశ్చేష్టురాలైపోయింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా సమాధానం చెబుతారని ఆశిస్తున్నాను...'' అని ఫిర్యాదు చేసింది.

ఈ వ్యవహారం కేంద్ర విమానయాన సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి వెళ్లడంతో వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ''దీనిపై సత్వరమే విచారణ చేపట్టి విమానయాన శాఖ, డీజీసీఏకి నివేదిక సమర్పించాలని ఆదేశించాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితి మీ తల్లిగారికి ఎదురవడం చాలా దురదృష్టకరం..'' అని సిన్హా పేర్కొన్నారు. దీంతో ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న ఎయిరిండియా హుటాహుటిన విచారణ ప్రారంభించినట్టు సమాచారం.

కాగా తాను ఎయిరిండియాకి కంప్లయింట్ చేసేందుకు కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తే.. వెబ్‌సైట్‌లో ఫీడ్ బ్యాక్ రాయాలంటూ సందేశం వచ్చిందని బాధితురాలి కుమార్తె వాపోయారు. ''ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్లు మరింత రెచ్చిపోతారని మీకు తెలియదా? ఈ అసహ్యకరమైన పనులపై సదరు విమాన సంస్థకు ఫిర్యాదు చేస్తే ముందు ముందు మళ్లీ ఇలాంటివి జరగకుండా అడ్డుకోవచ్చు..'' అంటూ బాధితురాలి కుమార్తె వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com